తీర్థల జాతరలో ట్రాఫిక్ నరకం…
ఎండలో కుప్పకూలిన భక్తులు!
మహాశివరాత్రి జాతరకు పోటెత్తిన భక్తజనం
కిలోమీటర్ మేర స్తంభించిన ట్రాఫిక్… గంటన్నర నరకయాతన
ఎండ తీవ్రతకు సొమ్మసిల్లిన మహిళలు, చిన్నారులు
చేతులెత్తేసిన పోలీసులు… కనిపించని ప్రజాప్రతినిధులు
కంకర రోడ్లతో దుమ్ముదూళి… వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు
ముందస్తు చర్యల లోపంపై అధికార యంత్రాంగంపై విమర్శలు
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం రూరల్ మండలం తీర్థల జాతరలో ఆదివారం ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తమై భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రహదారులన్నీ వాహనాలు, జనంతో కిక్కిరిసిపోయాయి. జాతర చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో భక్తులు తరలివచ్చినప్పటికీ, ట్రాఫిక్ నియంత్రణలో పోలీసు, అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతర ప్రాంతానికి వెళ్లే ప్రధాన మార్గాల్లో వాహనాలు ఎదురెదురుగా నిలిచిపోవడంతో దాదాపు కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. భక్తులు నడిచేందుకు కూడా వీలు లేకపోవడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు తగిన పోలీసు బలగాలు లేకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.

ఎండలో కుప్పకూలిన మహిళలు, చిన్నారులు
మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో దాదాపు గంటన్నర పాటు ట్రాఫిక్లో చిక్కుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు ఎండ తీవ్రతను తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వాహనాల్లో చిక్కుకుపోయిన కుటుంబాలు నీరు, నీడ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ఉన్న కొద్దిమంది ట్రాఫిక్ సిబ్బంది, హోంగార్డులు కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకురాలేక చేతులెత్తేశారు. కొంతమంది పోలీసులు చెట్ల నీడలో, టెంట్ల కింద ఉండిపోయారని భక్తులు ఆరోపించారు.

కంకర రోడ్లతో దుమ్ముదూళి… ప్రమాదకర పరిస్థితులు
పల్లెగూడెం నుంచి తీర్థల జాతర వరకు రహదారిపై కంకర, గ్రావెల్, మట్టి పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు వెళ్లిన ప్రతిసారి దుమ్ముదూళి భారీగా ఎగసిపడడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో పలువురు ద్విచక్ర వాహనదారులు కంకర రాళ్లపై జారి కిందపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. బ్రిడ్జి కింద వన్వే మార్గం ఏర్పాటు చేసినప్పటికీ, దాన్ని సక్రమంగా అమలు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దుమ్ము తగ్గించేందుకు రోడ్డుపై నీళ్లు చల్లే చర్యలు కూడా చేపట్టకపోవడం భక్తుల్లో అసంతృప్తి కలిగించింది.

ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
జాతరకు వేలాది మంది భక్తులు తరలివస్తారని ముందుగానే తెలిసినా, తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. గతంలో పలువురు ఎమ్మెల్యేల హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని, ప్రస్తుతం మాత్రం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్లో చిక్కుకుని ఇబ్బందులు పడిన పలువురు మహిళలు అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతర వంటి భారీ కార్యక్రమాలకు ముందస్తు ప్రణాళిక, తగిన పోలీసు బలగాలు, రహదారి సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.


