- నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
కాకతీయ, ఖమ్మం రూరల్: ఎన్నికల నియామవళి అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు, పకడ్భందీ బందోబస్తు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని దరిపల్లి అనంతరాములు ఇంజనీరింగ్ కళాశాల, మధిర పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, తల్లాడ మండలం రెడ్డిగూడెం లోని జ్యోతి జూనియర్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను బుధవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజతో కలిసి ఆయన పరిశీలించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబందించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు కలెక్టర్ సూచించారు. మొదటి విడతలో నిర్వహించే ఎన్నికల ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, స్ట్రాంగ్ రూం వద్ద బందోబస్తు పకడ్బందీగా నియమించాలని, పోలీసు కంట్రోల్ ద్వారా నిరంతర సీసీ కెమెరా పర్యవేక్షణ, మీడియా సెంటర్, వర్షం వలన ఎలాంటి జల్లు రాకుండా మరమ్మతులు, సరిపడా వసతులు సమకూర్చాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బోనకల్, మధిర, ఎర్రుపాలెం మూడు మండలాలు, సత్తుపల్లి మధర్ థెరీసా ఇంజనీరింగ్ కళాశాల నందు పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మూడు మండలాలు, రెడ్డిగూడెం క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల నందు ఏన్కూర్, తల్లాడ, కల్లూరు మూడు మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట కల్లూర్ డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జడ్పీ సీఈవో దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, అదనపు డీసీపీ ప్రసాద రావు, ఖమ్మం ఆర్డీవో నరసింహారావు, ఏదులాపురం మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, తహసీల్దార్లు కరుణాకర్ రెడ్డి, రాంప్రసాద్, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.


