ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నవభారత్ లోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలు నందు పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పర్యటన విజయవంతం కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన పటిష్టమైన బందోబస్తులో అదనపు ఎస్పీ-01, డీఎస్పీ-05,సిఐలు-30,ఎస్సైలు-62,ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్ళు -300,హోమ్గార్డ్స్-160 , 07 స్పెషల్ పార్టీలు,02 ఏఆర్ ప్లాటున్స్ మొత్తం 900 మంది పోలీసు అధికారులు,సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును 15 సెక్టార్లుగా విభజించి,ఆయా సెక్టార్లకు డీఎస్పీలను ఇన్చార్జీలుగా నియమించడం జరిగిందన్నారు. ప్రత్యేక భద్రతా బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తాయన్నారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులను గమనిస్తే వెంటనే పై అధికారులకు తెలియజేయాలని ఎస్పీ అన్నారు.తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సమావేశంలో పాల్గొన్న అధికారులకు ఎస్పీ సూచించారు.


