కాకతీయ, నేషనల్ డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కలకలం రేగింది. నగరానికి మానవ బాంబులను పంపించామంటూ, భారీ పేలుళ్లతో ముంబైని కుదిపేస్తామని దుండగులు బెదిరింపు మెయిల్స్ పంపించారు. లష్కర్ ఏ జిహాదీ అనే అకౌంట్ నుంచి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు ఈ మెసేజ్ వచ్చింది. నగరంలో 34చోట్ల వాహనాల్లో మానవ బాంబులను ఉంచామని..ఏ క్షణంలోనైనా పేలుళ్లు జరగవచ్చని అందులో దుండగులు హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో ముంబై మొత్తం హైఅలర్ట్ విధించారు. నగరంలో సోదాలు చేపట్టారు. నగరంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. బాంబు నిర్వీర్యం చేసే బ్రుందాలు, డాగ్ స్వ్కాడ్ లతో సోదాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే సమాచారం అందించాలని ముంబై వాసులకు పోలీసులు విజ్నప్తి చేశారు.
మెయిల్ లో ఏముందంటే..
పాకిస్తాన్ నుంచి 14 మంది టెర్రరిస్టులు ముంబైలోకి ప్రవేశించారు. 34 వాహనాల్లో మానవబాంబులను పంపించాము. వారి దగ్గర 400 కిలోల ఆర్డీఎక్స్ కూడా ఉంది. ఇప్పుడు మేం చేపట్టబోయే పేలుళ్లతో ముంబై అల్లకల్లోలంగామారడం ఖాయం. ఈ నగరాన్ని పేలుళ్లతో కుదిపేస్తామని మెయిల్ లో పేర్కొన్నారు. తనను తాను పాకిస్తాన్ కు చెందిన జిహాదీ గ్రూప్ సభ్యుడిగా పేర్కొంటూ ఓ దుండగులు ఈ మెయిల్ చేశాడు.


