కొత్తగూడెంలో ఎగిరేది ఎర్ర జెండానే
కార్పొరేషన్ అభివృద్ధికి సీపీఐనే మార్గదర్శి
ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి
అహంకార రాజకీయాలకు ప్రజల తీర్పు అవసరం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సీపీఐ జోరు కొనసాగుతోంది. ఈ గడ్డపై ఎగిరేది ఎర్ర జెండానేనని, ప్రజల సంక్షేమానికి సీపీఐనే నిజమైన దిక్సూచి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49, 10, 58, 59, 60 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడిందని, కొత్తగూడెం అభివృద్ధిలో సీపీఐ పాత్ర చిరస్మరణీయమని కూనంనేని తెలిపారు. బస్తీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం పోరాడుతున్నామని, ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్పొరేషన్ పాలన సాగాలంటే ఎర్రజెండా అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అభివృద్ధి అంటే మాటలు కాదు–పనులు
ఎమ్మెల్యేగా గడిచిన రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని కూనంనేని తెలిపారు. ప్రభుత్వంతో పోరాడి అవసరమైన నిధులు తెచ్చి, కొత్తగూడెంను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్నానని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ విజయం సాధిస్తే ప్రజల సమస్యలు మరింత వేగంగా పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్నికల సమయంలో తప్పుడు హామీలు, ప్రలోభాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి రాజకీయాలకు ఈ ఎన్నికలు గుణపాఠం కావాలని, ప్రజలు చైతన్యంతో ఓటేయాలని పిలుపునిచ్చారు.
పారదర్శక పాలనకు సీపీఐ విజయం అవసరం
కార్పొరేషన్ పాలనలో పారదర్శకత, ప్రజాప్రయోజనాలు ముందుండాలంటే సీపీఐ అభ్యర్థుల గెలుపు అనివార్యమని కూనంనేని అన్నారు. అభివృద్ధి అంటే కేవలం కాంట్రాక్టులు కాదని, సామాన్యుడి జీవితాల్లో మార్పు రావడమే నిజమైన అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. కొత్తగూడెం పట్టణంలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి సీపీఐ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని చెప్పారు. ప్రజల అండతో కార్పొరేషన్ను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అహంకారంతో వ్యవహరించే రాజకీయ శక్తులకు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని, నిబద్ధతతో పనిచేసే సీపీఐ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రోడ్ షోలు, ప్రచార సభలకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తుంటే విజయంపై పూర్తి నమ్మకం ఉందని కూనంనేని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా నాయకులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, భూక్యా దస్రు, వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, ఎస్కే ఫహీమ్తో పాటు సీపీఐ అభ్యర్థులు మూడ్ గణేష్, సహేరా మహమ్మద్, బోయిన విజయ్ కుమార్, మహమ్మద్ అబ్దుల్ సల్మా, కొచ్చెర్ల రాకేష్ కాంత్, ఇమ్రాన్ మహమ్మద్, బేత అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు


