అగ్గి రాజేసిన జీవో నంబర్ 252
డెస్క్ – ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య విభజన రేఖ
ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందనే విమర్శలు
‘రెండు కార్డుల విధానం’ బాధాకరమంటూ ఆవేదన
జర్నలిస్టుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం : అల్లం నారాయణ
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై జర్నలిస్టు యూనియన్ల మండిపాటు
సీఎం జోక్యం చేసుకొని జీవోను సరిదిద్దాలని డిమాండ్
రేపు కలెక్టరేట్ల ఎదుట టీయూడబ్ల్యూజే (143) ఆందోళనలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో జర్నలిస్టులకు అక్రిడిటేషన్ల జారీపై విడుదల చేసిన జీవో 252 అగ్గి రాజేసింది. డెస్క్-ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించడం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఈ జీవో ఉందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్డుల్లోనూ కోత తప్పదని.. ఈ విషయంలో రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలు నిక్కచ్చిగా వ్యవహరించాలని డెస్క్ జర్నలిస్టులు కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధంగా ‘రెండు కార్డుల విధానం’ బాధాకరమని, సీఎం స్వయంగా జోక్యం చేసుకొని జీవో-252ను సరిదిద్దాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈక్రమంలోనే తమ గళాన్ని వినిపించేందుకు, ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళనకు సిద్దమయ్యారు. ఈమేరకు టీయూడబ్ల్యూజే (143) యూనియన్ పిలుపు మేరకు డెస్క్ జర్నలిస్టులు నేడు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగనున్నారు.
డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులకు వేర్వేరుగా..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తొలిసారిగా డెస్క్ జర్నలిస్టులకూ ‘అక్రెడిటేషన్ కార్డులు’ ఇచ్చింది. అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్వయంగా డెస్క్ జర్నలిస్టు కావడం, వారు ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిడి.. తదితర అంశాల మీద సంపూర్ణ అవగాహన ఉండటంతో దాదాపు అర్హత కలిగిన డెస్క్ జర్నలిస్టులు అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చేవిధంగా చొరవ చూపారు. ఆ విధంగా 2022లో దాదాపు 23 వేల మంది జర్నలిస్టులకు కేసీఆర్ ప్రభుత్వం అక్రెడిటేషన్లు ఇచ్చింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిన వివక్షను రూపుమాపింది. దీంతో డెస్క్ జర్నలిస్టులకు కూడా బస్ పాస్లు, హెల్త్కార్డులు అంది వచ్చాయి. వీటి కాల పరిమితి 2024 జూన్ 30తో ముగిసింది. దశలవారీగా 2025 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం కొత్త అక్రెడిటేషన్ల జారీకి జీవో-252ను విడుదల చేసింది. డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులకు వేర్వేరు కార్డుల విధానం తీసుకొచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాల వార్తలను సేకరించే జర్నలిస్టులకు ‘అక్రెడిటేషన్ కార్డు’లు, ఇతరులకు ‘మీడియా కార్డు’ల పేరిట జర్నలిస్టులను విభజించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సర్క్యులేషన్ ఆధారంగానే కార్డులు
జీవో-252లో భాగంగా వివిధ మీడియా సంస్థలకు కేటాయించిన అక్రెడిటేషన్ కార్డుల సంఖ్య కూడా జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని, అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది. ప్రస్తుతం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇచ్చిన అక్రెడిటేషన్ కార్డుల కంటే ఈ జీవోలో పేర్కొన్న కోటా చాలా తక్కువగా ఉన్నది. సర్క్యులేషన్ ఆధారంగా ఆయా పత్రికలకు కోటా నిర్ణయించారు. 2.5 లక్షల కంటే ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు ఎక్కువ కార్డులు, అంతకంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలకు తక్కువ కార్డులు కేటాయించారు. ఇది సహజంగానే ఇప్పటికే బలంగా పాతుకుపోయిన ఆంధ్రా యాజమాన్యాల నిర్వహణలోని పత్రికలకు ఎక్కువ మేలు చేసేదిగానూ, తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ప్రారంభమై ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న తెలంగాణ యాజమాన్యాల నిర్వహణలోని పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎక్కువ నష్టం చేసేదిగానూ ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
చాలా మందికి కోత తప్పదు
ఎలక్ట్రానిక్ మీడియాలోనూ కనీసం 30 మందికిపైగా డెస్క్ జర్నలిస్టులు ఉంటారు. కానీ, జీవో-252లో పేర్కొన్న ప్రకారం అందులో మూడో వంతు మందికి కూడా అక్రెడిటేషన్ కార్డులు మంజూరయ్యే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఆమేరకు ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కోత పెట్టినట్టుగానే పరిగణించాలని యూనియన్ నేతలు చెబుతున్నారు. కాబట్టి, ఆయా మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల వాస్తవిక సంఖ్యకు అనుగుణంగా ఎటువంటి వివక్ష చూపకుండా అర్హులైన అందరికీ గతంలో మాదిరిగానే అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా అనర్హులకు ఇవ్వకుండా అవసరమైన మెకానిజాన్ని కూడా రూపొందించాలని కోరుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలు కూడా నిక్కచ్చిగా వ్యవహరించాలని, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీకి పూర్తి విరుద్ధంగా ‘రెండు కార్డుల విధానం’ ఉండటం బాధాకరమని, ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని జీవో-252ను సరిదిద్దాలని డెస్క్ జర్నలిస్టులు కోరుతున్నారు.
కొత్త జీఓతో జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగదు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన అక్రెడిటేషన్ మార్గదర్శకాలు వృత్తిపరమైన జర్నలిస్టులను నష్టపర్చవని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసారు. సంక్షేమ చర్యలు ఎలాంటి వివక్షత లేకుండా అందరికీ వర్తించడంతో పాటు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు యోచిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వపు అక్రెడిటేషన్ ఉత్తర్వులు ఉర్దూ జర్నలిస్టుల పట్ల అనుసరించిన వివక్షతను, చిన్న పత్రికల పట్ల చూపిన చిన్న చూపును తెలంగాణ హైకోర్టు కొట్టి వేసిన అంశాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసారు. ఈ నేపథ్యంలోనే వాటిని కొత్త జీఓలో మార్పు చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. నూతన జీఓపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలను వెల్లడిస్తూ, వక్రీకరిస్తూ సంక్షేమ చర్యలు విలేకరులకు మాత్రమే వర్తిస్తాయని చెబుతున్నారని ఆయన విచారం వ్యక్తం చేసారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. వృత్తిపరమైన జర్నలిస్టులందరికీ ఇవి వర్తిస్తాయని ఆయన స్పష్టం చేసారు. ఈ విషయాలపై అవసరమైతే వివరణ కొరవచ్చని ఆయన సూచించారు. జర్నలిస్టుల సంక్షేమ చర్యల పట్ల ముఖ్యమంత్రితో, సమాచార శాఖ మంత్రితో ఎప్పుడైనా మాట్లాడడానికి అవకాశాలు ఎలాగూ ఉంటాయన్నారు. ఇందుకు విరుద్ధంగా
ఓ రాజకీయ ఎత్తుగడతో కొన్ని శక్తులు ఆందోళన చేయాలని తలపెట్టడం అత్యంత విచారకరమని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల పట్ల, వారి సమస్యల పట్ల రేవంత్ రెడ్డి నాయకత్వాన ఉన్న ప్రజా ప్రభుత్వం సానుకూల పరిష్కారానికి వెళ్తుంది తప్పా, గత ప్రభుత్వం మాదిరిగా వివక్షత చూపే అవకాశమే లేదని ఆయన తెలిపారు. నూతన జిఓపై పనిగట్టుకొని కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని విశ్వసించరాదని వర్కింగ్ జర్నలిస్టులకు శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


