ఎదులాపురం అభివృద్ధి నా బాధ్యత
అభివృద్ధిపై మాటలు చెప్పడం కాదు.. చేసి చూపిస్తా
మున్సిపాలిటీని రోల్మోడల్గా తీర్చిదిద్దుతాం
పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాల అమలు
కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి
మర్యాదగా ఉంటే గౌరవిస్తాం… లేకపోతే యుద్ధమే!
మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి
కాకతీయ, కూసుమంచి : “రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది… మీ శ్రీనన్న మంత్రిగా కీలక స్థానంలో ఉన్నాడు. ప్రజల దీవెనలతో ఏదంటే అది చేయగలిగే శక్తి నాకు వచ్చింది. ఇక అభివృద్ధి చేసి చూపిస్తా” అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 28, 29, 30 వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన తీరుపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రజలు పదేళ్ల దుర్మార్గ పాలనను అంతం చేసి ప్రజా పరిపాలనను తెచ్చుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. “మంచిగా ఉన్నంత కాలమే మర్యాద ఉంటుంది… అది లేకపోతే యుద్ధం చేయాల్సిందే” అంటూ గత పాలకుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేవలం కమీషన్ల కోసమే పనులు చేశారని, పేదల ఇళ్ల కంటే దొరల ఇళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు. హాస్టల్ విద్యార్థులకు కనీసం నాణ్యమైన భోజనం కూడా పెట్టలేని వారు నేడు గొప్పలు చెబుతున్నారని, అలాంటి వారి మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు.

పార్టీ రంగులు చూడం… పేదరికమే ప్రామాణికం
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో రాజకీయాలకు ఎలాంటి తావు లేదని మంత్రి స్పష్టం చేశారు.
“మీరు ఏ పార్టీకి ఓటు వేశారన్నది నాకు అనవసరం. అర్హులైన పేదవాళ్లయితే చాలు… ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం” అని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, వచ్చే ఏప్రిల్ నుంచి మరో విడత ఇళ్ల పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగులకు నెల మొదటి తారీఖునే జీతాలు వంటి సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందన్నారు.
ఏదులాపురం అభివృద్ధి బాధ్యత నాదే
ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత పూర్తిగా తానే తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. “మీ ఇంటి పెద్దకొడుకుగా మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తా” అని తెలిపారు. మాటలు చెప్పేవాళ్లను కాదు… పని చేసే వాళ్లను గుర్తించాలని, అభివృద్ధి కోసం నిలబడే వారికే పట్టం కట్టాలని ప్రజలకు సూచించారు.
డిపాజిట్లు రాకుండా బుద్ధి చెప్పండి
ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలు తీర్పు ఇవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న –
తుమ్మల బిక్షం (10వ వార్డు), పేరం వెంకటలక్ష్మి (11వ వార్డు), నూకల రామ్మోహన్ రెడ్డి (28వ వార్డు), వెంపటి ఉమ (29వ వార్డు), కొట్టం శిరీష (30వ వార్డు), అభ్యర్థులను “హస్తం” గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధికి అడ్డు పడే రాజకీయాలను తిప్పికొట్టాలని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.


