రాజ్యాంగబద్ధంగానే తెలంగాణ బిల్లుకు ఆమోదం
తెలంగాణపై టీడీపీ ఎంపీ వ్యాఖ్యలకు చామల కౌంటర్
ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టవద్దని హెచ్చరిక
కాకతీయ, భువనగిరి : లోక్సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై టీడీపీ లోక్సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు చేసిన వ్యాఖ్యలను భువనగిరి లోక్సభ సభ్యుడు చామల కిరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటుపై మాట్లాడిన మాటలు సరైనవి కావని ఆయన అన్నారు. లోక్సభలో తలుపులు మూసి తెలంగాణ బిల్లు పాస్ చేశారని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని తెలిపారు. ఫిబ్రవరి 14, 2014న జరిగిన పరిణామాలను బ్లాక్ డేగా పేర్కొంటూ నాటి స్పీకర్ మీరా కుమారి తెలంగాణ బిల్లును ఆమోదించడం తప్పు అని చెప్పడం సరికాదని కిరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లు రాజ్యాంగబద్ధంగానే లోక్సభలో ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మద్దతుగా లేఖ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఆ విషయం లావు శ్రీకృష్ణ దేవరాయలకు తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. లోక్సభలో సుష్మాస్వరాజ్ తెలంగాణకు మద్దతుగా మాట్లాడారని బీజేపీ నాయకులు ఇప్పటికీ చెబుతుంటారని పేర్కొన్నారు. ఇప్పుడు బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ ఎంపీ తెలంగాణపై మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్న సమయంలో ఇప్పుడు తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టడం ఎందుకని ప్రశ్నించారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత సత్సంబంధాలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ఎవరి ప్రసన్నం కోసమో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుగా మాట్లాడితే ఊరుకోమని స్పష్టం చేశారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని కూడా ఆయన సూచించారు.


