షైన్ హై స్కూల్లో టాలెంట్ టెస్ట్
పదో తరగతి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పరీక్ష
కాకతీయ, బోనకల్ : బోనకల్ మండల కేంద్రంలోని షైన్ హై స్కూల్లో బుధవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహించగా, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అన్సర్ పాషా మాట్లాడుతూ.. పదో తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ సమయంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. పరీక్ష విధానం, సమయ నిర్వహణ, సబ్జెక్టులపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ పరీక్ష ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డైరెక్టర్ లాల్ మహమ్మద్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి పరీక్షలు మరిన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రిన్సిపాల్ శ్వేత మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ అన్సర్ పాషా, డైరెక్టర్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ శ్వేత, అడ్మినిస్ట్రేషన్ ఇన్చార్జి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


