విద్యార్థులు శాస్త్రవేత్తలుగాఎదగాలి
*కలెక్టర్ జితేష్ పాటిల్
కాకతీయ, కొత్తగూడెం : విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగటానికి ఇప్పటి నుంచే కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోహన్ అకాడమీ, విద్యాశాఖ వారి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు శుక్రవారం నిర్వహించిన “మీట్ ద కలెక్టర్” కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా వారి చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలకు సాంకేతికత ఆధారంగా పరిష్కారాలు కనుగొనాలని ఆ పరిష్కారాలు ఆచరణ యోగ్యంగా ఉండి ఎవరైనా స్వల్ప పెట్టుబడితో తయారు చేసుకునే విధంగా ఉండాలని సూచించారు. ఇలా తయారు చేసే క్రమంలోనే శాస్త్రవేత్తలు ఆవిర్భవిస్తారని వారే దేశ ప్రజల ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపగలుగుతారని పిల్లలకు ఉద్బోధించారు. పిల్లలు తయారు చేసిన వివిధ రకాల రోబోటిక్ ఎగ్జిబిట్లను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. రైతులు పంటలు పండించడానికి ఎదుర్కొనే సమస్యలు, ఇళ్లలో కోతుల సమస్యలు, దొంగల నుండి ఇంటిని రక్షించుకోవడానికే అవసరమైన వ్యవస్థలు, ఇటువంటి నిత్య జీవిత సమస్యలకు ఆచరణ యోగ్యమైన పరిష్కారాలు కనుగొనాలని పిల్లలకు తెలిపారు. సోహన్ అకాడమీ వారు జిల్లాలోని గుర్తించిన 13 పీఎం శ్రీ పాఠశాలల్లో వర్క్ షాప్ లు నిర్వహించి పిల్లలకు రోబోటిక్స్ పై అవగాహన కల్పించడం నిజంగా అభినందనీయమని అన్నారు. సోహన్ అకాడమీ డైరెక్టర్ సహదేవ్ మాట్లాడుతూ ఇప్పటివరకు 32 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామని కానీ భద్రాద్రి జిల్లాలో లభించిన ఆదరణ ఏ జిల్లాలోనూ లభించలేదని దీనికి కారణమైన కలెక్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ అటల్ టింకరింగ్ ల్యాబ్ పథకంలో భాగంగా పీఎం శ్రీ పాఠశాలలకు అందించిన పరికరాలను ఎలా వినియోగించాలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు కూడా అవగాహన కల్పించిన సోహన్ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనపరచిన పాఠశాలలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ.నాగరాజ శేఖర్, సమ్మేళిత విద్యా కోఆర్డినేటర్ ఎస్కే సైదులు, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, సోహన్ అకాడమీ ఫౌండర్ డైరెక్టర్ సహదేవ్, పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


