కాకతీయ, కొత్తగూడెం రూరల్ : విద్యార్థులు చదువుతోపాటు కళలలో కూడా రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో రెండు రోజులపాటు జరగనున్న జిల్లా స్థాయి కళా ఉత్సవం పోటీలను మంగళవారం ప్రారంభించారు.
ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ చిన్నప్పుడు తనకు కూడా కళల పట్ల ఆసక్తి ఉండేదని చిన్నతనంలో సంగీత ఉపాధ్యాయురాలు అంటే తనకు ఎంతో ఇష్టమని కానీ వాటిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేక పోయానని కానీ నేటి విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుంటేనే భవిష్యత్తు ఆకర్షణీయంగా ఉంటుందని సూచించారు. పిల్లలందరూ తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకోవడానికి దారి చూపించే ఒక మార్గమే ఇటువంటి పోటీలను పిల్లలకు ఉపయోగకరమన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి బి.నాగలక్ష్మి మాట్లాడుతూ పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని తీపి జ్ఞాపకాలను తమతో తీసుకువెళ్లాలని సూచించారు. ఈ పోటీలలో సుమారు రెండు వందల మంది పిల్లలు 12 రకాలైన కళారూపాలను రెండు రోజులపాటు ప్రదర్శించనున్నారని అందులో భాగంగా మొదటి రోజు శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, థియేటర్ ఆర్ట్, విజువల్ ఆర్ట్స్ అంశాలలో పోటీలు నిర్వహించనున్నామని రెండవ రోజు గాత్ర సంగీతం, వాద్య సంగీతం, కథలు చెప్పటం అంశాలలో పోటీలను నిర్వహించనున్నామని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి నాగరాజు శేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు సతీష్ కుమార్, సైదులు, వివిధ పాఠశాల నుండి వచ్చేసిన విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


