పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ‘శ్రీరామ్’ భరోసా
: రూ. 2.2 కోట్ల నగదు బహుమతుల వెల్లువ!
పదవ తరగతి విద్యార్థులకు సువర్ణావకాశం.
ప్రతిభ చాటి లక్షలాది రూపాయలు గెలుచుకోండి: ఎంఈఓ వెంకట్ పిలుపు
కొమ్మినేపల్లి హైస్కూల్లో పోస్టర్ విడుదల
కాకతీయ,కామేపల్లి:ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కనే పేద విద్యార్థులకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఒక అద్భుతమైన వరాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏకంగా రూ. 2.2 కోట్ల భారీ నగదు బహుమతులను ప్రకటించడం విద్యావర్గాల్లో చర్చనీయాంశమైంది. బుధవారం కొమ్మినేపల్లి హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ వెంకట్ మరియు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ వెంకటకృష్ణ కలిసి ఈ పథకానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ప్రతిభకు పట్టాభిషేకం.. పేదరికం అడ్డుకాదు!
ఈ సందర్భంగా ఎంఈఓ వెంకట్ మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో శ్రీరామ్ సంస్థ ఈ “మిషన్”ను చేపట్టడం అభినందనీయమన్నారు. “తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదవ తరగతి విద్యార్థులకు ఇది ఒక గొప్ప ఆయుధం. మన మండల విద్యార్థులు కష్టపడి చదివి, స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించి మండలానికి రాష్ట్రస్థాయిలో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
సృజనాత్మకతకు పెద్దపీట
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ, పేద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ భారీ నగదు బహుమతులు అందుతాయని, ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం బ్రాంచ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాయల బిక్షమయ్య, ఇంచార్జ్ హెచ్ఎం రమ ప్రభ, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, జ్యోతి, కైలాసరావు, భవాని, కవిత, రంజాన్, ఉషారాణి మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


