పంట కాల్వ కబ్జా చేస్తున్న రియల్ వ్యాపారులు
బఫర్ జోన్ నిబంధనలు పాటించకుండానే అనుమతులా..?
ఎన్వోసీ ఎలా ఇచ్చారంటూ మండిపడుతున్న జనం
చర్యలు తీసుకునేలా కలెక్టర్ చొరవ చూపాలని వేడుకోలు
కాకతీయ, సుజాతనగర్ : భూములకు ధరలు ఆకాశాన్ని తాకుతున్న క్రమంలో అంగుళం భూమి కూడ బంగారమే… ఇదే క్రమంలో తమ స్థలం పక్కన ప్రభుత్వ భూములు ఏవైనా ఉంటే మూడో కంటికి కనపడకుండా కబ్జా చేస్తున్నారు కొందరు అపర మేధావులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ భూములను కొందరు రియల్టర్లు కొనుగోలు చేసి, వాటిని ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్లాట్ల మధ్య నుంచి పంట పొలాలకు నీరందించే ప్రధాన కుడి కాలువ 7వ తూమును (సింగభూపాలెం చెరువు) దర్జాగా కబ్జా చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు, సాగు ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు.
బఫర్ జోన్లో ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు తీసుకోకపోతే డీటీసీపీ వెంచర్ కు నిబంధనల ప్రకారం అనుమతులు ఇవ్వొద్దు. కానీ ఆ శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా వచ్చిందో అధికారులకే తెలియాలి. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పదించి సింగభూపాలెం చెరువు నుంచి సాగునీరు అందించే ప్రధాన కాలువ కబ్జా చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ దృష్టి సారించి పంట కాల్వను సంరక్షించాలని రైతులు వేడుకుంటున్నారు. కాలువ కబ్జా గురించి వివరణ కోరేందుకు ఇరిగేషన్ డీఈ ను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.


