ఆకాశవాణిలో ఘనంగా రేడియో కిసాన్ దివాస్
ఆదర్శ రైతులు, అధికారులకు ఘన సన్మానం
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రంలో శనివారం ‘రేడియో కిసాన్ దివాస్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా రేడియో కేంద్రం ప్రాంగణంలో ఔషధ, పూల మొక్కలతో ఏర్పాటు చేసిన “ప్రకృతి మాత గ్రీన్ గార్డెన్”ను స్టేషన్ ప్రోగ్రామ్ హెడ్ కొలిపాక శంకరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి. బాబురావు, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ టీ. భరత్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్ అహ్మద్, పశువైద్యుడు డాక్టర్ జి. ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సమీకృత వ్యవసాయం అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. పంటలతో పాటు చేపల పెంపకం, కోళ్ల పెంపకం, మేకల పెంపకం వంటి అనుబంధ రంగాలను కలిపి సాగు చేస్తే రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని వివరించారు.
వ్యవసాయ చైతన్యంలో రేడియో కీలక పాత్ర
కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ వ్యవసాయ సాంకేతికతలను రైతులకు చేరవేయడంలో రేడియో కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. రేడియో ద్వారా ప్రసారం చేస్తున్న వ్యవసాయ కార్యక్రమాలు రైతుల్లో అవగాహన పెంచి, ఆధునిక సాగు పద్ధతులను అవలంబించేందుకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. రేడియో కార్యక్రమాల ద్వారా వ్యవసాయంలో వస్తున్న మార్పులు, ఆధునిక పద్ధతులపై అవగాహన పెరగడంతో రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నట్లు ఆదర్శ రైతులు తెలిపారు. రైతుల అభివృద్ధికి ఆకాశవాణి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కిసాన్ దివాస్ పురస్కరించుకుని పలువురు అభ్యుదయ రైతులు, అధికారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆదర్శ రైతులు గొట్టిపాటి వెంకటేశ్వర్లు, నర్సిరెడ్డి, క్రీస్తు రాజు, సందీప్, హనుమా, మొక్కల పెంపకం దారులు, రేడియో సిబ్బంది, రేడియో జాకీలు తదితరులు పాల్గొన్నారు.


