కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం పింఛను దారులకు ప్రతి నెల మొదటి రోజునే ఠంచనుగా పింఛన్లను అందించి ఆర్థిక భద్రత కల్పిస్తోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆయన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ (డిసిఎంఎస్) బండి రామకృష్ణతో కలిసి నగరంలోని 12వ డివిజన్ నోబుల్ కాలనీలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి తిరిగి స్వయంగా పింఛన్లు అందించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రూ.200 ల పింఛన్ మొత్తాన్ని ఒకేసారి రూ.2 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పింఛను రూ. 3 వేల నుంచి రూ.4 వేలకు పెంచి పింఛనుదారులను ఆర్థికంగా ఆదుకుందన్నారు. వికలాంగులకు రూ.6 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.10 వేలు, పూర్తిగా మంచానికే పరిమితమై లేవలేని స్థితిలో ఉన్న అభాగ్యులకు రూ.15 వేలు పింఛన్ అందించి వారి జీవితాలకు అండగా నిలబడిందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 64 లక్షల మందికి ఈ సాయం ఆంధ్రప్రదేశ్లో లభిస్తోందని అన్నారు. అదేవిధంగా దీపం పథకం కింద మూడు కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పథకం కింద 68 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.10 వేల కోట్ల నిధుల జమ, అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు పీఎం కిసాన్ తో కలిపి తొలి విడతగా రూ.7 వేలు అందించామని, త్వరలో మరో విడతగా రూ.7 వేలు అందించనున్నామని మంత్రి తెలిపారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో వెలుగునింపుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరి ఇంటికీ సంక్షేమ పథకాలు చేరవేయడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోందన్నారు. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా, పేదల కష్టాలు తగ్గించేలా పాలన సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ (నాని), ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ మెంబర్ లంకె నారాయణ ప్రసాద్, నగర మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మచిలీపట్నం టౌన్ పార్టీ ప్రెసిడెంట్ లోగిశెట్టి వెంకట స్వామి, 12వ డివిజన్ ఇంచార్జ్ బొమ్మిడి శ్రీరాములు, మాదివాడ రాము తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.


