కర్రెగుట్టలో ‘ఆపరేషన్ కగార్-2’ నిలిపివేయాలి
ఆదివాసీలపై చర్యలను ఖండించిన సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై డివిజన్ కార్యదర్శి నాగయ్య విమర్శలు
కాకతీయ, తుంగతుర్తి : కర్రెగుట్ట ప్రాంతంలో కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్-2’ను వెంటనే నిలిపివేయాలని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ కార్యదర్శి పేర్ల నాగయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం తుంగతుర్తిలో విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలనే పేరుతో కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను మోహరించి, క్యాంపులు ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ఆదివాసీలపై తీవ్ర ప్రభావం పడుతోందని, నిరపరాధ ప్రజలపై హింస కొనసాగుతోందని పేర్కొన్నారు. దండకారణ్య ప్రాంతంలో ఉన్న సహజ వనరులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆరోపిస్తూ, ప్రజల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏవైనా ఆరోపణలు ఉంటే రాజ్యాంగ పరమైన విధానాల్లో విచారణ జరపాలని, ప్రజలపై బలప్రయోగం చేయడం తగదన్నారు. ఈ చర్యలను ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని పిలుపునిస్తూ, ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


