ట్యాంక్ బండ్పై
సేవాలాల్ విగ్రహం ప్రతిష్టించాలి
బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్
కాకతీయ కొత్తగూడెం రూరల్ : సంత్ సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణం మద్దిమడుగులో వద్దని, హైదరాబాద్ ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీఎల్ఎస్ జేఏసీ వైస్ చైర్మన్ లావుడియా ప్రసాద్ నాయక్ డిమాండ్ చేశారు. ఈమేరకు కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ మాట్లాడారు. సేవాలాల్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని, ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని, 100 ఎకరాల్లో సేవాలాల్ మహారాజ్ బంజారా యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బంజారాలకు లైబ్రరీ మ్యూజియం ఏర్పాటు చేయాలని, ఇంజినీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్, పీజీ కాలేజ్ నర్సరీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి నాగర్ కర్నూల్ మద్దిమడుగు ప్రాంతం 500 కిలోమీటర్లు దూరంలో ఉండడం ద్వారా ఈ ప్రాంతం వారు సేవాలాల్ మహారాజుని దర్శించుకోవడం చాలా కష్టమని అన్నారు ఏకపక్ష నిర్ణయంతో ప్రభుత్వం సేవాలాల్ విగ్రహాన్ని ఎక్కడపడితే అక్కడ పెట్టి జాతిని, సేవాలాల్ మహారాజ్ను అగౌరపరిచినట్టేనని అన్నారు. సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షులు మోతిలాల్ నాయక్ పిలుపుమేరకు 11న సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి అన్ని బంజారా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మందితో తరలి వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జి వి ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మూడ్ బాలాజీ నాయక్, టి టి ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర విద్యార్ధిభాగం బోడ శ్రీనివాస్ నాయక్, సేవలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం జిల్లా కార్యదర్శి ధరావత్ నాగరాజు నాయక్, లావుడియా సక్రు నాయక్, బట్టు రవి నాయక్, సేవాలాల్ సేన మండల అధ్యక్షుడు భూక్య సేవ్య నాయక్, బోడ అర్జున్ నాయక్, బోడనానియా నాయక్, బట్టు హర్ సింగ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.


