రైతు భరోసాకు కొత్త నిబంధనలు!
సాగులో ఉన్న భూములకే ఇక సాయం
శాటిలైట్ సర్వేతో సాగులో లేని 20 లక్షల ఎకరాలు గుర్తింపు
మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిధుల జమ చేసేందుకు ప్రయత్నం
అర్హులైన రైతులకే లబ్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు భూమి పేరుపై నమోదైన ప్రతి ఎకరానికి సాయం అందిస్తుండగా, ఇకపై నిజంగా సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూముల గుర్తింపు ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో, త్వరలోనే ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. రైతు భరోసా పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సమగ్ర సర్వే చేపట్టింది. గతంలో సాగు చేయని భూములు, కొండలు–గుట్టలు, రియల్ ఎస్టేట్ ప్లాట్లు, జాతీయ రహదారుల పరిధిలోని భూములకు కూడా పెట్టుబడి సాయం వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న విమర్శల నేపథ్యంలో, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆధునిక శాటిలైట్ సాంకేతికతతో సర్వే నిర్వహించారు. సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీ ద్వారా జరిగిన ఈ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 1.53 కోట్ల ఎకరాల భూమిని పరిశీలించగా, దాదాపు 20 లక్షల ఎకరాల్లో అసలు పంటల సాగు జరగడం లేదని తేలింది. దీంతో ఈ భూములకు ఇకపై రైతు భరోసా నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిధులు
రైతు భరోసా నిధుల విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఫిబ్రవరి 4న మిర్యాలగూడ సభలో ఆయన మాట్లాడుతూ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని తెలిపారు. యాసంగి సీజన్కు సంబంధించి సుమారు రూ.9,000 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్లే నిధుల జమ ఆలస్యం అవుతోందని, ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే అర్హులైన 65 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6,000 చొప్పున నేరుగా నగదు జమ అవుతుందని సీఎం హామీ ఇచ్చారు.
క్షేత్రస్థాయిలోనూ వెరిఫికేషన్
శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించిన వివరాల్లో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, నిజంగా సాగులో లేని భూములను తుది జాబితా నుంచి తొలగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములు, ఫామ్ హౌస్లు, నివాస ప్రాంతాలుగా మారిన స్థలాలను కూడా ఈ జాబితా నుంచి తప్పిస్తున్నారు. కేవలం పంటలు పండించే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు ఆదా అవుతాయని, ఆ మొత్తాన్ని నిజమైన రైతుల సంక్షేమానికి మరింత సమర్థంగా వినియోగించవచ్చని అభిప్రాయపడుతున్నారు. రైతు భరోసా పథకంలో తీసుకొస్తున్న ఈ మార్పులు పారదర్శకతకు, న్యాయమైన లబ్ధి పంపిణీకి దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


