- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- దేవస్థాన నిర్మాణం పూర్తయితే జిల్లా ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి
- ఆలయ నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించిన కలెక్టర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: కొత్తగా నిర్మించనున్న తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం పూర్తయితే ఖమ్మం జిల్లా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మరింత అభివృద్ది చెందుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నూతనంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రాష్ర్టప్రభుత్వం ఆదేశాల మేరకు కావలసిన స్థలాల సేకరణ కోసం ఆదివారం జిల్లా కలెక్టర్ క్షేత్రస్ధాయిలో పర్యటించారు. నగరంలోని 15వ డివిజన్ కొత్తగూడెం, అల్లీపురంలోని ప్రభుత్వ భూములు, అత్యంత ప్రాధాన్యత కలిగిన స్ధలాల సేకరణ సాధ్యాసాధ్యాలపై మ్యాప్ లను పరిశీలన చేసి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్టాడుతూ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణానికి పలు స్థలాల ప్రతిపాదనలు పరిశీలించామన్నారు. టీటీడీ దేవస్థానం ప్రాశస్త్య ప్రమాణాలకు అనుగుణంగా రహదారి సామీప్యత, ఆలయంతో పాటు ఎక్కువ సంఖ్యలో వసతి గృహాల ఏర్పాటు అనుకూలత ఆధారంగా రెండు, మూడు స్థలాలకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. టీటీడీ అధికారులు, స్తపతి, పండితులు ఖమ్మం నగరానికి వచ్చి ప్రతిపాదిత స్థలాలను క్షేత్రస్ధాయిలో పరిశీలించి ఆలయానికి అనువైన భూమిని ఖరారు చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఈ పర్యటనలో ఖమ్మం అర్డీవో నరసింహారావు, ఖమ్మం అర్బన్ తహసీల్ధార్ సైదులు, తదితరులు పాల్గొన్నారు.


