పారిశుధ్యానికి ప్రాధాన్యతే నా లక్ష్యం
17వ వార్డును క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దుతా
ప్రజా ఆరోగ్యమే అభివృద్ధికి పునాది
అవకాశం ఇస్తే సేవలతో నిరూపించుకుంటా
యువతకు ఉపాధి–ఉద్యోగ అవగాహన కల్పిస్తా
కాకతీయ, కల్లూరు : ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే గ్రామాలు, పట్టణాలు, దేశం సుభిక్షంగా ఉంటాయని 17వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి కనపర్తి శ్యామల రాజ్ కుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్గా తనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే వార్డులో పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, ప్రజల క్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. “నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి… తానేంటో పనితో నిరూపించుకుంటాను” అని ప్రజలను అభ్యర్థించారు.
పార్టీలతో సంబంధం లేకుండా సహాయం కోసం తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ తన వంతు సహకారం అందించానని, ఎవ్వరినీ ఖాళీ చేతులతో వెనక్కి పంపలేదని గుర్తు చేశారు. శత్రుత్వం లేని సమాజమే తన సంకల్పమని స్పష్టం చేశారు. 2014 నుంచి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా నమ్మిన సిద్ధాంతానికే కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇప్పుడు అదే పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, ప్రజల మద్దతు ఎంతో అవసరమని అన్నారు. తనను గెలిపిస్తే “క్లీన్ అండ్ గ్రీన్” కార్యక్రమం ద్వారా వార్డులో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి పారిశుధ్యానికి పెద్దపీట వేస్తానని హామీ ఇచ్చారు. అలాగే యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వార్డు అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్యే ఉంటానని, ఆశీర్వదించి గెలిపించాలని కనపర్తి శ్యామల రాజ్ కుమార్ కోరారు.


