హంతకులను కఠినంగా శిక్షించాలి
మహిళా న్యాయవాది హత్యపై చేర్యాలలో నిరసన
విధుల బహిష్కరించిన బార్ అసోసియేషన్ నాయకులు
కాకతీయ, చేర్యాల: చేవెళ్ల కోర్టులో యువ న్యాయవాది స్వప్న దారుణ హత్యను నిరసిస్తూ చేర్యాల బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. కోర్టు ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించి, ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెళ్ల వీర మల్లయ్య మాట్లాడుతూ, న్యాయవాదులపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆస్తి వివాదాల పేరుతో దాడులు, హత్యలు చేయడం అత్యంత హేయమైన చర్య అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని కోరారు. చేవెళ్ల కోర్టులో జరిగిన మహిళా న్యాయవాది హత్యకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును త్వరితగతిన విచారించి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. గతంలోనూ అనేక మంది న్యాయవాదులపై దాడులు జరిగిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఇకపై అలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆస్తి వివాదాలకు చట్టపరమైన మార్గాలే పరిష్కారం కావాలని సూచించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు భూమిగారి మనోహర్, ఆరెళ్ల మహేందర్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తాటికొండ ప్రణీత్, బి.యాదగిరి గౌడ్, పర్వతం రాములు, పొన్నం సురేష్, నల్లగొండ సంతోష్, అంకని సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


