కొత్తగూడెం మేయర్గా మూడ్ గణేష్
మేయర్ పీఠం సీపీఐ ఖాతాలో
కాంగ్రెస్–సీపీఐ పొత్తులో భాగంగా మేయర్ పదవి సీపీఐకి కేటాయింపు
మేయర్గా సీపీఐ నేత మూడ్ గణేష్ పేరు అధికారికంగా ఖరారు
మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు
కాంగ్రెస్ నుంచి డిప్యూటీ మేయర్ ఎంపికకు కసరత్తు పూర్తి
కొత్త కార్పొరేషన్లో తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టనున్న గణేష్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ పీఠం సీపీఐ ఖాతాలోకి వెళ్లింది. కాంగ్రెస్–సీపీఐ పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన మేయర్ పదవికి ఆ పార్టీ సీనియర్ నాయకుడు మూడ్ గణేష్ పేరును అధికారికంగా ఖరారు చేశారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ తొలి మేయర్గా మూడ్ గణేష్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఫిబ్రవరి 13న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్–సీపీఐ కూటమి ఆధిక్యం సాధించింది. ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం మేయర్ పదవిని సీపీఐకి కేటాయించారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం మూడ్ గణేష్ పేరును ఖరారు చేసింది. ఆయన అనుభవం, సమన్వయ నాయకత్వం, ప్రజలలో ఉన్న మంచి పేరు కారణంగా ఎంపికకు విశేష స్పందన లభిస్తోంది.

కీలక నేతల సమక్షంలో ఎన్నిక ప్రక్రియ
మేయర్ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్కే సబీర్ పాషా తదితర నాయకులు ఫిబ్రవరి 16న కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పొత్తు ఒప్పందంలో భాగంగా డిప్యూటీ మేయర్ పదవిని కాంగ్రెస్ పార్టీకి కేటాయించినట్లు సమాచారం. ఈ పదవికి సంబంధించి కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే అభ్యర్థి ఎంపికపై చర్చలు పూర్తి చేసినట్లు తెలిసింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
సంబరాల్లో మునిగిపోయిన కూటమి శ్రేణులు
మేయర్గా మూడ్ గణేష్ ఎంపిక ఖరారవడంతో కాంగ్రెస్, సీపీఐ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లో తొలి మేయర్ బాధ్యతలు సీపీఐకి దక్కడం చారిత్రాత్మక ఘట్టంగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కొత్తగూడెం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందని నాయకులు స్పష్టం చేస్తున్నారు.


