మేడారం జాతరలో అర్ధరాత్రి గందరగోళం
అదుపు తప్పిన క్యూలైన్లు.. ఒక్కసారిగా తోపులాట
పరిస్థితిని నియంత్రించలేక చేతులెత్తేసిన పోలీసులు
భక్తులకా జాతర.. వీఐపీలకా? అంటూ మండిపాటు
కాకతీయ, మేడారం బృందం : మేడారం మహాజాతరలో అర్ధరాత్రి తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మవార్ల దర్శనానికి ఏర్పాటుచేసిన క్యూలైన్లు అదుపు తప్పడంతో ఒక్కసారిగా భక్తుల మధ్య తోపులాట జరిగింది. పెరిగిన రద్దీని నియంత్రించడంలో పోలీసులు విఫలమవడంతో పరిస్థితి కొంతసేపు ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి సమయంలో దర్శనానికి వచ్చిన భక్తుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో క్యూలైన్లు కుదించుకుపోయాయి. ముందుకు వెళ్లే ప్రయత్నంలో భక్తులు ఒకరిపై ఒకరు పడుతూ తోపులాటకు దారితీసింది. మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. కొందరు భయంతో క్యూలైన్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
చేతులెత్తేసిన పోలీసులు
తోపులాట మొదలైన వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ, రద్దీ ఎక్కువగా ఉండటంతో నియంత్రణ సాధ్యం కాలేదు. కొంతసేపటికి పోలీసులు వెనక్కి తగ్గినట్లుగా భక్తులు ఆరోపిస్తున్నారు. సరైన మార్గదర్శకాలు, స్పష్టమైన సూచనలు లేకపోవడమే ఈ గందరగోళానికి కారణమని పలువురు అంటున్నారు. పోలీసుల తీరుపై భక్తులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ జాతర భక్తుల కోసమా? లేక వీఐపీలు, రాజకీయ నాయకుల కోసమా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సామాన్య భక్తులకు సరైన సౌకర్యాలు లేకుండా, ప్రత్యేక మార్గాలు మాత్రం వీఐపీలకే కేటాయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా క్యూలైన్ల నిర్వహణను పకడ్బందీగా చేయాలని, అదనపు పోలీసు బలగాలు మోహరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే మేడారం జాతరలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


