కాకతీయ, నేషనల్ డెస్క్: భారత్ వేగంగా అభివ్రుద్ధి చెందుతోందని, ప్రపంచ దేశాలు కేవలం మన వ్రుద్ధిని గమనించడమే కాకుండా మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని..టోక్యోలో జరిగిన భారత్, జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రస్తుతం భారత్ లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, పారదర్శక విధానాలు ఉన్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివ్రుద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మనదే అని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. దేశంలో పెట్టుబడులు కేవలం పెరగడమే కాదు..అవి రెట్టింపు అవుతున్నాయని ప్రధాని మోదీ వివరించారు. భారత్, జపాన్ మధ్య భాగస్వామ్యం కేవలం వ్యూహాత్మకమే కాదని..అదొక స్మార్ట్ బంధమని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ రెండు దేశాల కలయిక ఆసియా శతాబ్దంలో స్థిరత్వం, వృద్ధి, శ్రేయస్సును నిర్దేశిస్తుందన్నారు.
సాంకేతిక రంగంలో భారత్, జపాన్ కలిసి పనిచేసే అవకాశాలపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏఐ, సెమీ కండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్, అంతరిక్ష రంగాల్లో భారత్ ఎంతో ధైర్యమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. జపాన్ సాంకేతికత, భారత ప్రతిభావంతుల మేధస్సు కలిస్తే ఈ శాతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించవచ్చని ప్రధాని మోదీ తెలిపారు. ఈ రెండు దేశాలు కూడా ఉమ్మడి ప్రయోజనాలు, శ్రేయస్సుగా మారాయని.. జపాన్ వ్యాపారాలకు భారత్ ఒక మంచి వేదిక అవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


