లైన్మెన్ను సస్పెండ్ చేయాలని గ్రామస్థుల డిమాండ్
రైతుల వద్ద డబ్బుల వసూళ్లపై కొమురవెల్లి ఏఈకి ఫిర్యాదు
కాకతీయ, కొమురవెల్లి : కొమురవెల్లి మండలం తపస్పల్లి గ్రామంలో జూనియర్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న బొంగోని సంపత్ను వెంటనే సస్పెండ్ చేయాలని గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులు అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు సర్పంచ్ పుట్ట కనకరాజు, ఉపసర్పంచ్ నర్సింలు, వార్డు సభ్యులు కలిసి కొమురవెల్లి మండల విద్యుత్ శాఖ ఏఈకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. గ్రామంలో లైన్మెన్ సంపత్ కొద్ది రోజులుగా రైతులు, వినియోగదారుల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పనులు చేయిస్తానని హామీ ఇచ్చి మోసం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామసభలో ఎల కనకయ్య మాట్లాడుతూ, తన వద్ద లైన్మెన్ సంపత్ రూ.5,000 తీసుకుని ఇప్పటివరకు పని పూర్తి చేయలేదని, అడిగితే ప్రతిసారి “తర్వాత చేస్తా” అంటూ కాలయాపన చేస్తున్నాడని ఆరోపించారు. అదే విధంగా నాలుగో వార్డు సభ్యురాలు కొండపాక లచ్చవ్వ మాట్లాడుతూ, ఏజీఎల్ కనెక్షన్కు సంబంధించిన డీడీ కట్టిస్తానని చెప్పి రూ.7,000 తీసుకున్నప్పటికీ ఇప్పటివరకు డబ్బు తిరిగి ఇవ్వలేదని, డీడీ కూడా కట్టలేదని గ్రామసభలో వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన ఫరహాదు అనే వ్యక్తి కూడా ఫోన్ ద్వారా ఏఈకి ఫిర్యాదు చేస్తూ, మీటర్ ఇప్పిస్తానని చెప్పి లైన్మెన్ సంపత్ తన వద్ద రూ.14,000 తీసుకున్నాడని, ఇప్పటివరకు మీటర్ ఇవ్వలేదని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో లైన్మెన్ సంపత్పై చర్యలు తీసుకుని వెంటనే సస్పెండ్ చేయాలని, అతని స్థానంలో వేరే లైన్మెన్ను తపస్పల్లి గ్రామానికి నియమించాలని గ్రామ ప్రతినిధులు ఏఈకి సమర్పించిన ఫిర్యాదులో కోరారు. గ్రామానికి సంబంధించిన ఇతర విద్యుత్ సమస్యలను కూడా అదే లేఖలో పేర్కొంటూ, వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రజల నుంచి వరుసగా వస్తున్న ఆరోపణలపై విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు గ్రామస్థులు తెలిపారు.


