సర్వేల్లో ఆధిక్యం… యాస నాగమణికి టికెట్
15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు
ప్రజామద్దతే ప్రాతిపదికగా ఎంపిక
కాకతీయ, కల్లూరు :కల్లూరు మున్సిపాలిటీ 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా యాస నాగమణి శ్రీకాంత్ను పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో ఆయనకు బీఫామ్ అందజేశారు.
అభ్యర్థుల ఎంపికలో భాగంగా పార్టీ నిర్వహించిన పలు సర్వేల్లో యాస నాగమణి శ్రీకాంత్కు ప్రజల్లో స్పష్టమైన ఆధిక్యం ఉన్నట్లు తేలడంతో అధిష్టానం ఆయనకే ప్రాధాన్యం ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గత కొన్నేళ్లుగా ఎలాంటి పదవులు ఆశించకుండా వార్డులో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వస్తున్నారని నాయకులు పేర్కొన్నారు.

స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే, మంత్రి సహకారంతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేయించారని, కులమతాలకు అతీతంగా సేవలందించడంతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారని తెలిపారు. ఈ కారణంగానే టికెట్ కేటాయింపులో ఆయన పేరు ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యాస నాగమణి శ్రీకాంత్ మాట్లాడుతూ… ప్రజాసేవే తన లక్ష్యమని, అవకాశం ఇస్తే 15వ వార్డులోని అన్ని సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల ఆశీస్సులతో గెలిచి వార్డు అభివృద్ధికి నిరంతరం పనిచేస్తానని తెలిపారు. తమ అమూల్యమైన ఓటుతో శ్రీకాంత్ను గెలిపిస్తామని స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


