భాషా ఉపాధ్యాయులే విజ్ఞాన వారధులు
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఉపాధ్యాయ పండిత పరిషత్తు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
ఉపాధ్యాయ సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తామన్న హామీ
కాకతీయ, కామేపల్లి: భాషా ఉపాధ్యాయులే విద్యార్థుల విజ్ఞానానికి వారధులని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర నూతన క్యాలెండర్ను మధిర క్యాంప్ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. నెలల వారీగా బడ్జెట్ విడుదల చేస్తున్నామని, సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు త్వరలో మంజూరు చేస్తామని చెప్పారు. ఉపాధ్యాయులకు వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. భాషా పండితుల దశాబ్దాల కలను నెరవేర్చడం రాష్ట్ర ప్రభుత్వ కట్టుబాటని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సాధ్యమైందన్నారు. జిల్లా అధ్యక్షుడు లావుడ్యా రవికుమార్ చౌహన్ మాట్లాడుతూ భాషా పండితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, పిఆర్సి మంజూరు, డిఎ బకాయిల విడుదల వంటి అంశాలను ఉప ముఖ్యమంత్రికి విన్నవించగా, సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.



