సైబర్ నేరాలకు కేంద్రంగా ఖమ్మం!
కమిషన్ ఆశతో అమాయకులు బలి
ఫారెక్స్ ట్రేడింగ్, ఆన్లైన్ పెట్టుబడి యాప్ల పేరుతో ఆకర్షణ
పెరిగిన ఖమ్మం కమిషనరేట్ సైబర్ క్రైం వింగ్ నిఘా
అయినా తగ్గని సైబర్ కేటుగాళ్లు
రాజకీయ అండతో అసలు నిందితులు ఎస్కేప్
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా క్రమంగా సైబర్ నేరాలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. దేశ విదేశాల నుంచి పనిచేస్తున్న సైబర్ ముఠాలు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్నాయి. పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ అసలు సూత్రధారులను పట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు వెలుగుచూసిన అతిపెద్ద సైబర్ మోసం రూ.547 కోట్లకు పైగా జరిగినట్టు పోలీసులే నిర్ధారించారు. కానీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వికాస్ చౌదరిని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అతడిని రక్షిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. అసలు దోషులను వదిలేసి, తమకు తెలియకుండానే అకౌంట్లలో డబ్బులు పడిన సాధారణ వ్యక్తులను అరెస్టు చేయడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది. ఈ ఘటన మరవకముందే ఈ నెల 7న మరో రూ.2.73 కోట్ల భారీ సైబర్ మోసం బయటపడింది. మరోవైపు తమిళనాడు పోలీసులు కూడా ఖమ్మం జిల్లాపై దృష్టి పెట్టి వెంకటాపాలెం గ్రామానికి చెందిన ఇద్దరిని సైబర్ నేరాల కేసులో అరెస్టు చేసి తిరునెల్వేలికి తరలించడం జిల్లాలో కలకలం సృష్టించింది. ఇలా వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కమీషన్ ఆశతో వల…
సైబర్ నేరగాళ్లు ముందుగా ఆన్లైన్ ద్వారా వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత ఫోన్ చేసి “నాలుగు శాతం కమిషన్ ఇస్తాం” అంటూ ఆకర్షించి, బాధితుల పేర్లపై బ్యాంకు అకౌంట్లు తెరిపిస్తున్నారు. ఆ అకౌంట్ల ద్వారా కోట్ల రూపాయల లావాదేవీలు నిర్వహిస్తూ, బాధితులకు స్వల్ప కమిషన్ ఇచ్చి అసలు డబ్బంతా తామే డ్రా చేసుకుంటున్నారు. చివరకు ఎలాంటి సంబంధం లేని అమాయకులే కేసుల్లో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ దందా వెనుక ఉన్న వికాస్ చౌదరి, లవిష్ చౌదరి వంటి ప్రధాన నిందితులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండటంతోనే పోలీసులు వారిని తాకలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వందల కోట్ల మోసాలు జరిగినా ప్రధాన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతుండటం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.
ఫారెక్స్ ట్రేడింగ్, ఆన్లైన్ పెట్టుబడి యాప్ల పేరుతో..
ఇటీవల ఫారెక్స్ ట్రేడింగ్, ఆన్లైన్ పెట్టుబడి యాప్ల పేరుతో భారీ మోసాలకు పాల్పడిన అంతర్జాతీయ ముఠాను ఖమ్మం పోలీసులు ఛేదించారు. “బాట్ బ్రో”, “వైఎఫ్ఎక్స్” వంటి యాప్ల ద్వారా నెలకు 9 నుంచి 10 శాతం లాభాలు వస్తాయని నమ్మబలికి ప్రజల నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు సేకరించినట్టు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో భుక్య శ్రీధర్ నాయక్, తేజావత్ ఉపేందర్, నీలకంఠం సిద్ధు, వంకుడ్యత్ సురేష్ సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఇప్పటివరకు రూ.2.73 కోట్లకు పైగా అక్రమంగా సంపాదించినట్టు విచారణలో నిర్ధారణ అయింది. ఈ డబ్బుతో కొనుగోలు చేసిన ఆస్తులను అటాచ్ చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ మొత్తం నెట్వర్క్ దుబాయ్ కేంద్రంగా నడుస్తోందని, లవిష్ చౌదరి అలియాస్ నవాబ్ అలీ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు ఈ మోసాల్లో కీలక పాత్ర పోషించినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
పోలీసుల కీలక హెచ్చరిక
వరుస సైబర్ మోసాలు వెలుగులోకి వస్తుండటంతో ఖమ్మం పోలీస్ కమిషనర్ ప్రజలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. అధిక లాభాలు వస్తాయంటూ వచ్చే ఆన్లైన్ పెట్టుబడి పథకాలపై అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ గుర్తింపు లేని యాప్లు, అనుమానాస్పద స్కీమ్లలో పెట్టుబడులు పెట్టవద్దని సూచించారు. తెలియని వ్యక్తులకు బ్యాంకు వివరాలు ఇవ్వకూడదని, ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సైబర్ మోసాలకు గురైన బాధితులు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. అరెస్టులు జరుగుతున్నప్పటికీ అసలు నిందితులు మాత్రం తప్పించుకుంటుండటంతో జిల్లాలో సైబర్ నేరాల నియంత్రణకు మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం కేంద్రంగా వెలుగులోకి వస్తున్న వరుస మోసాలు సామాన్యుల్లో భయాన్ని పెంచుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే సైబర్ ముఠాలు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


