కాపుకాసి..గొంతు కోసి
ఖమ్మం జిల్లాలో సీపీఎం దారుణ హత్య
చింతకానిలో సంచలన ఘటన.. తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో సీపీఎం నేత సామినేని రామారావు దారుణ హత్యకు గురయ్యారు. సీపీఎం పార్టీ అనుబంధ రైతు సంఘం నేత కూడా అయిన రామారావు శుక్రవారం ఉదయం పాతర్లపాడు గ్రామంలో వాకింగ్ చేస్తుండగా దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఘటనకు దారి తీసిన పరిస్థితుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఉదయం సీనియర్ సీపీఎం నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై తీవ్రదిగ్భ్రాంతి ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యక్తం చేశారు.దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తాం అన్నారు.కలుషిత హింసా రాజకీయాలకు తావు లేదన్న డిప్యూటీ సీఎం శాంతిభద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులను సీరియస్ గా హెచ్చరించారు. క్లూస్ టీం, స్నిపర్ డాగ్స్, సైబర్ టీం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అన్ని మార్గాలను ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు.మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలుపుతూ రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని, పూర్తిస్థాయిలో ఆదుకుంటానని భట్టి భరోసా ఇచ్చారు.


