- ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ విస్తృత ప్రచారం
- పాదయాత్రలతో ఓటర్ల దగ్గరకు నేతలు
- రామచంద్రరావు నేతృత్వంలో మాస్ క్యాంపెయిన్
- కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ హాజరు
- కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు
- నియోజకవర్గ అభివృద్ధికి హామీలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో మంగళవారం నియోజకవర్గంలో ‘మాస్ కాంపెయిన్’ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు ప్రతి ఓటరునూ కలుసుకుని ఓట్లు అభ్యర్థించేలా పాదయాత్రలు నిర్వహించారు. ఎన్ రామచంద్రరావు ఎర్రగడ్డ డివిజన్లో పాదయాత్రలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడలో, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ బోరబండ డివిజన్ రాజ్ నగర్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాల్లో రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా సీనియర్ పార్టీ నేతలు పాల్గొని విజయవంతం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నేతలు మండిపడ్డారు. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్లకు అవకాశం కల్పించారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తే జూబ్లిహిల్స్ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. పదేండ్లు బీఆర్ఎస్, రెండేండ్లుగా కాంగ్రెస్ జూబ్లిహిల్స్ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. గడపగడపకూ తిరుగుతూ ఓటర్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాలను వివరించారు. ఆరు గ్యారంటీలు సహా ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని కాంగ్రెస్ను దుయ్యబట్టారు.
ఎంఐఎం, కాంగ్రెస్ పొత్తుపై మండిపాటు
అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్తో ఎంఐఎం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని కిషన్ రెడ్డి, బండి సంజయ్ మండిపడ్డారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో కలిసిపోతూ హైదరాబాద్ అభివృద్ధిని ఎంఐఎం అడ్డుకుంటుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, ఎంఐఎం అనైతిక పొత్తుతో ఎదురయ్యే సమస్య లను వివరించారు. రౌడీషీటర్లను ప్రోత్సహిస్తూ, కబ్జాలకు పాల్పడే వ్యక్తులకు ఈ రెండు పార్టీలు కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. ఎన్నికల పోటీలో లేకుండానే జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో పెత్తనం అంతా ఎంఐఎం చేస్తుందని ఆరోపించారు.
బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి
నియోజకవర్గంలో డ్రైనేజీ సమస్యలు, మంచినీటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. గుండాయిజం, కబ్జాలు, రౌడీషీటర్ల నుంచి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సహకారంతో జూబ్లిహిల్స్ను అభివృద్ధి చేస్తామని తెలిపారు. రోడ్డు, విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం.. అవసరమైన చోట బస్తీ దవాఖానాల ఏర్పాటు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు వివరించారు. ప్రజల కష్టాలు, ఇబ్బందులు ఆరా తీస్తూ కమలం గుర్తుకు ఓటు వేసి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ నేతలు ప్రచారం చేశారు.


