ప్రకృతిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత
ప్లాస్టిక్ వినియోగం తగ్గించకపోతే భవిష్యత్కు ముప్పు
ప్రజాగాయకుడు, కవి, కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత డా. జయరాజ్
కాకతీయ, ఖమ్మం : ప్రకృతిని సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రజాగాయకుడు, కవి, కాళోజీ సాహిత్య పురస్కార గ్రహీత డా. జయరాజ్ అన్నారు. స్థానిక ఎస్.బి.ఐ.టి కళాశాలలో గురువారం నిర్వహించిన ప్రకృతి వైజ్ఞానిక అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ప్రకృతి తీవ్రంగా నష్టపోతుందని, అనేక జీవరాశులు అంతరించిపోవడానికి ఇది ప్రధాన కారణమని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరికరాల వల్ల రేడియేషన్, కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రజలు జీవనశైలిలో మార్పు తీసుకురాకపోతే ప్రకృతిని కాపాడటం కష్టమని పేర్కొన్నారు. కళాశాల సెక్రటరీ డా. జి. ధాత్రి, ప్రిన్సిపల్ డా. జి. రాజ్ కుమార్ విద్యార్థులు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్లు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


