హాస్టల్ పై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని
గురుకుల కళాశాలలో కలకలం.. అప్రమత్తమైన సిబ్బంది
సమయానికి చికిత్సతో ప్రాణాపాయం తప్పిన సమీరా
మెరుగైన పరీక్షల కోసం నిమ్స్కు తరలింపు
కాకతీయ, బోనకల్ : మార్కులు తక్కువగా వచ్చాయని మనస్థాపానికి గురైన ఇంటర్మీడియట్ విద్యార్థిని హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలో కలకలం రేపింది. సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చదువుతున్న తుడుం సమీరా తీవ్ర ఆందోళనకు గురై ఈ ఘటనకు పాల్పడింది. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది వెంటనే స్పందించడంతో ఆమె ప్రాణాపాయం తప్పింది. కళాశాల ప్రిన్సిపాల్ పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం, ముదిగొండ మండలం మాదాపురం గ్రామానికి చెందిన తుడుం సమీరా బోనకల్ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతోంది. ఇటీవల నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. శుక్రవారం ఉదయం క్లాస్ జరుగుతున్న సమయంలో వాష్రూమ్కు వెళ్తున్నానని చెప్పి కళాశాల మూడో అంతస్తుకు వెళ్లి ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో భవనం పై నుంచి దూకింది.
సమయానికి స్పందించిన సిబ్బంది
ఈ ఘటనను గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే స్పందించి సమీరాను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. సమీరాకు మరింత సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన ప్రిన్సిపాల్ పద్మావతి, పరీక్షల సమయంలో విద్యార్థులు భయాందోళనలకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలని సూచించారు. ఇటీవలే విద్యార్థులను ప్రోత్సహిస్తూ పరీక్షలపై అవగాహన కల్పించినప్పటికీ ఈ ఘటన జరగడం బాధాకరమన్నారు. విద్యార్థులు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.


