సతి, పతి చేతుల్లో
మానుకోట పాలన
ఐఏఎస్, ఐపీఎస్ కపుల్స్ కు అరుదైన అవకాశం
జిల్లా ఎస్పీగా శబరీష్ తనదైన ముద్ర
కలెక్టర్గా స్నేహశబరీష్ కీలక బాధ్యతలు
కాకతీయ మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా పాలన భార్యభర్తల చేతుల్లోకి వెళ్లింది. తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీల్లో మహబూబాబాద్ కలెక్టర్గా స్నేహ శబరీష్ నియమితులయ్యారు. కలెక్టర్ స్నేహ భర్త… శబరీష్ ఇప్పటికే జిల్లా ఎస్పీగా తన మార్క్ చూపుతున్నారు. ఈక్రమంలోనే దంపతులిద్దరూ ఒకే జిల్లాలో అత్యున్నతస్థాయి ఉద్యోగులుగా ప్రజలకు సేవలందించనుండటం ఆసక్తికరంగా మారింది. దీంతో ప్రజలందరి దృష్టి వీరిద్దరిపైనే పడింది. ఇలాంటి అరుదైన అవకాశాన్ని యువ ఐఏఎస్, ఐపీఎస్ కపుల్స్ దక్కించుకోవడం రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశమైంది. కాగా.. మానుకోట కలెక్టర్గా పనిచేసిన అద్వైత్ కుమార్ సింగ్ తెలంగాణ భవన్ (న్యూఢిల్లీ) సమన్వయ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ అయ్యారు. కొంతకాలంగా ఆయన పని తీరుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలోనే హన్మకొండ కలెక్టర్గా సమర్థవంతమైన విధులు నిర్వహించిన పవర్ఫుల్ ఆఫీసర్గా పేరు పొందిన స్నేహ శబరీష్… మానుకోట కలెక్టర్గా నియమితులవడంతో ఇక్కడ కూడా తనదైన ముద్ర వేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
భద్రాద్రి, ములుగులో తనదైన ముద్ర
ములుగు జిల్లాలో ఎస్పీగా పని చేసిన డాక్టర్ శబరిష్ కొంతకాలం కింద మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. హనుమకొండ కలెక్టర్గా బాధ్యతలు చేపడుతున్న స్నేహ శబరీష్ .. మహబూబాబాద్ జిల్లాకు తాజాగా బదిలీ కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిపోయింది. అటు భర్త ఐపీఎస్, ఇటు భార్య ఐఏఎస్ గా మహబూబాబాద్ జిల్లాలో పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఇకపై మహబూబాబాద్ జిల్లాలో పారదర్శకమైన పాలన అందిస్తారని వారికున్న రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఎస్పీ పి.శబరీష్ తనదైన శైలిలో ములుగు జిల్లాలో తన మార్కును చూపించారు. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏఎస్పీగా ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి అక్కడ విధులు నిర్వహించారు. అక్కడ రాజకీయ కోణాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన సతీమణి నిర్ణయాలతో తమపై ఎలాంటి మచ్చ పడకుండా జాగ్రత్తలు తీసుకోగలిగారు. భద్రాచలం అంటేనే అక్రమ ఇసుక దందాకు కేరాఫ్ అడ్రస్. రాష్ట్రంలోని రాజకీయ నాయకుల కన్ను మొత్తం ఆ ప్రాంతాల్లోనే నిక్షిప్తమై ఉండేది. అలాంటి సమయంలో అక్రమ ఇసుక దందాను అరికట్టేందుకు ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎన్నో రకాల ఆంక్షలు విధించి కట్టడి చేసేందుకు కృషి చేశారు. ఈక్రమంలోనే ఆయనపై విపరీతమైన ఒత్తిళ్లు పెరిగిపోయాయి. శబరీష్ను ముప్పు తిప్పలు పెట్టేందుకు ప్రణాళిక రచించినప్పటికీ ఆయన తనేంటో నిరూపించుకోగలిగారు. ఆ తర్వాత ములుగు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మావోయిస్టులపై ఫోకస్ పెట్టారు. తనవంతుగా అజ్ఞాతంలో ఉన్న వారందరినీ జనజీవన స్రవంతిలోకి రప్పించడంలో సఫలీకృతులయ్యారు.

మహబూబాబాద్ జిల్లాలో మార్క్
ఇటీవల ఎన్నికల్లో కేసముద్రం, తొర్రూరు మున్సిపాలిటీలో విపరీతమైన స్ట్రగుల్స్ ఏర్పడ్డాయి. సమాన వార్డు కౌన్సిలర్లు గెలుచుకున్న అధికార ప్రతిపక్ష పార్టీల విషయంలో చాలా గందరగోళమే ఏర్పడింది. ఇలాంటి సమయంలో ఎస్పీ శబరీష్ తనదైన శైలిలో పోలీసు యంత్రంగాన్ని తన ఆధీనంలోకి తీసుకొని సరైన నిర్దేశం చేయడంతో జిల్లాలో ఎక్కడా కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అరికట్టగలిగారు. అలాంటి ఎస్పీ డాక్టర్ పి శబరీష్ తన సహచరిణి ఐఏఎస్ అధికారిణి స్నేహ శబరిష్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో సతి, పతి చేతుల్లో మహబూబాబాద్ జిల్లా పాలన మరింత మెరుగుపడుతుందని ప్రజలు నమ్ముతున్నారు. గతంలో నిరాశకు గురైన వారందరికీ ఇప్పుడు స్నేహ శబరిష్ తనదైన శైలిలో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారని మహబూబాబాద్ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటిదాకా ఆగిపోయిన ఫైళ్లు మొత్తం క్లియర్ చేస్తారని నమ్ముతున్నారు. ఐఏఎస్ అధికారిణి వస్తుండడంతో గతంలో ఇక్కడ పనిచేసిన కలెక్టర్ ప్రీతి మీనా స్టైల్ లోనే పనిచేస్తారని ఇక్కడ ప్రజలు ఆశిస్తున్నారు.
అధ్వైత్ పనితీరుపై మరకలు
మానుకోట కలెక్టర్ గా పనిచేసి తెలంగాణ భవన్ (న్యూఢిల్లీ) సమన్వయ ప్రత్యేక కార్యదర్శిగా వెళ్లిన అద్వైత్ కుమార్ సింగ్ పై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన నిర్ణయాలు కొన్ని వివాదాస్పదం అయ్యాయి. మహబూబాబాద్ మీదుగా వెళ్లే గ్రీన్ ఫీల్డ్ హైవే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రాస్ రోడ్డు నుంచి వలిగొండ వరకు వెళ్లే నేషనల్ హైవే రహదారుల విషయంలో రైతులకు, సంబంధిత యజమానులకు సరైన పరిహారం ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు సైతం చోటు చేసుకున్నాయి. అదే సమయంలో జిల్లా ఉన్నతాధికారి అద్వైత్ కుమార్ సింగ్ కాంట్రాక్టర్ల నుంచి అత్యధికంగా నగదును స్వీకరించారనే విమర్శలు కూడా ఆ సమయంలో వెల్లువెత్తాయి. రహదారులపై బాధిత రైతులు, ఫ్లాట్స్ యజమానులు తీవ్రమైన ఆందోళనలు చేపట్టారు. ఈ సమయంలో కలెక్టర్ రావాలని తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై జాతీయ రహదారులకు క్లీన్ చిట్ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి.


