ఏజెన్సీలో గోవుల అక్రమ రవాణా..!
అర్ధరాత్రి వాహనాల్లో హైదరాబాద్ కబేళాలకు తరలింపు
సర్పంచ్ అనుమతి పత్రాలపై అనుమానాలు..
అధికారుల మౌనం చర్చనీయాంశం
కాకతీయ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో గోవుల అక్రమ రవాణా జరుగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం, కొత్తగూడెం ప్రధాన రహదారుల మార్గంగా అర్ధరాత్రి వేళల్లో డీసీఎం, బొలేరో వంటి వాహనాల్లో గోవులను హైదరాబాద్లోని కబేళాలకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల కళ్లుగప్పి ఈ తరలింపు జరుగుతోందా..? లేక అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతోందా..? అన్నది స్పష్టత లేకుండా ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై జిల్లాలో వివిధ వర్గాల నుంచి ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి.
అనుమతి పత్రాలపై అనుమానాలు
గోవుల తరలింపులో గ్రామ సర్పంచ్ల అనుమతి పత్రాలు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే ఇవి నిజమైన అనుమతులా..? లేక నకిలీ పత్రాలా..? అన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వ్యక్తులు గోవులను పెంపకం కోసం తీసుకెళ్తున్నామని చెప్పి రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి, అనంతరం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో గోవులను వాహనాల్లో తాడులతో కట్టి తరలించడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.
గోవుల తరలింపు జరుగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనుమతి పత్రాల ఆధారంగా వాహనాలను అనుమతిస్తున్నారా..? లేక సరైన తనిఖీలు లేకుండా వదిలేస్తున్నారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధులు, మధ్యవర్తుల ప్రమేయం ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఈ అంశంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి అక్రమ రవాణా ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు, పలు హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా గోవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గోవుల తరలింపు చట్టబద్ధమైతే స్పష్టత ఇవ్వాలని, అక్రమమైతే వెంటనే అరికట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


