అండగా ఉంటా… ఆశీర్వదించండి
పదేళ్ల దొరల పాలనలో అభివృద్ధి శూన్యం
6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల కృష్ణ ప్రచారం
కాకతీయ, చేర్యాల : పదేళ్ల బీఆర్ఎస్ పాలన పేదలకు ఏమీ చేయలేదని, ఆ పాలన కమీషన్ల రాజకీయాలుగానే చరిత్రలో మిగిలిందని కాంగ్రెస్ పార్టీ 6వ వార్డు అభ్యర్థి ముస్త్యాల కృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా ప్రభుత్వానికి అండగా నిలిచి ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 6వ వార్డులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్త్యాల కృష్ణ మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేర్యాల మున్సిపాలిటీలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏదీ జరగలేదన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం చేర్యాల ప్రాంతాన్ని విభజించి, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అడ్డుపడ్డ బీఆర్ఎస్ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పు తీసుకొచ్చే అభివృద్ధే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇన్నాళ్ల నిర్లక్ష్య పాలన కారణంగా మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. 6వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన వెంటనే మౌలిక వసతుల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ గెలుపే లక్ష్యం
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ముస్త్యాల కృష్ణ పిలుపునిచ్చారు. 6వ వార్డు నుంచి చేతు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలహీనపడిందని, ఆ పార్టీపై ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


