స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తారు
మేము చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది
సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాలకు తెలుసు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఉదయం మధిర క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పెద్దలు 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్థిక, పాలన వ్యవస్థలను విధ్వంసం చేస్తే ప్రణాళికా ప్రకారం వాటిని సరి చేసుకుంటూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని అన్నారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వారి హృదయాలకు, మనసులకు బాగా తెలుసు అని అన్నారు.
సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, ఇందిరమ్మ ప్రభుత్వం బీసీల దశాబ్దాల కోరికను నెరవేర్చింది అన్నారు. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి సర్వే నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించామన్నారు.
మీ కోసం నిలబడిన కాంగ్రెస్ పార్టీని కనిపించకుండా చేయాలని బీఆర్ఎస్ నాయకులు మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, కుట్రపూరితంగా కోర్టులకు పంపిస్తున్నారని అన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి హామీలు ఇచ్చి బీఆర్ఎస్ పెద్దలు అమలు చేయలేదు అన్నారు. లక్ష రూపాయల రైతు రుణమాఫీని 10 సంవత్సరాల్లో కూడా పూర్తిగా చేయలేకపోయారని డిప్యూటీ సీఎం విమర్శించారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాలేశ్వరం కుంగిపోయింది అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చింది అన్నారు.
యువతకు గ్రూప్ వన్ గ్రూప్ టు తో పాటు ఇప్పటికే 60,000 ఉద్యోగాలు, 21 వేల కోట్ల రైతు రుణమాఫీ, తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా, 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్తు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, సన్న ధాన్యం సాగు చేసే రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్, 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణం ఇందుకుగాను 22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రంలో 1.05 కోట్ల కుటుంబాలు ఉండగా 96 లక్షల కుటుంబాలకు మనిషికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం, బహిరంగ మార్కెట్లో 56 రూపాయలు కిలో ధర పలుకుతున్న సన్నబియ్యాన్ని ఇందిరమ్మ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి ఏటా 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు పంపిణీ చేసి ఐదు సంవత్సరాల్లో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తున్నాం అన్నారు.


