జాబ్ గ్యారెంటీతో ఉచిత స్కిల్ ట్రైనింగ్
లాజిస్టిక్స్ రంగంలో నైపుణ్య శిక్షణ
శిక్షణ అనంతరం 100% ఉద్యోగ హామీ
కలెక్టర్ జితేష్ పాటిల్
కతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉచిత స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తెలిపారు. ఎల్ఎస్సీ లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్, రీడింగ్టన్ ఫౌండేషన్ సహకారంతో జాబ్ గ్యారెంటీతో కూడిన ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా లాజిస్టిక్స్ రంగానికి చెందిన వేర్హౌస్ స్టోర్ కీపర్, సప్లై చైన్ అసోసియేట్, ఎక్స్పోర్ట్–ఇంపోర్ట్ ఎగ్జిక్యూటివ్ వంటి కోర్సుల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. శిక్షణ పూర్తైన వెంటనే 100 శాతం ప్లేస్మెంట్తో ఉద్యోగాలు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ నెల 24న నిర్వహించిన ఎంపిక డ్రైవ్లో 29 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా, మొత్తం 51 మంది యువత శిక్షణకు హాజరయ్యారని తెలిపారు. మరింత మందికి అవకాశం కల్పించేందుకు ఈ నెల 27న ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరో ఎంపిక డ్రైవ్ నిర్వహించి అదనంగా 50 మందిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ అర్హతతో 18 నుంచి 27 ఏళ్ల వయస్సు కలిగిన యువతి, యువకులు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు. శిక్షణ అనంతరం నెలకు రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకు జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, శిక్షణ పూర్తిగా ఉచితం కాగా స్కిల్ ఇండియా సర్టిఫికేషన్తో పాటు భోజనం, వసతి సౌకర్యాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ పాటిల్ పిలుపునిచ్చారు.


