ఆంజనేయ స్వామి ఆలయానికి శంకుస్థాపన
కాకతీయ, కారేపల్లి : మండల పరిధిలోని రావోజీ తండా గ్రామపంచాయతీ మల్లన్నగూడెంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామ సర్పంచ్ భూక్య బాలు నాయక్, పద్మ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, భక్తులు వారికి ఘన స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాలు నాయక్ మాట్లాడుతూ గ్రామస్తుల సమిష్టి సహకారంతో ఆలయ నిర్మాణం చేపట్టడం శుభపరిణామమన్నారు. ఆధ్యాత్మిక చింతనతో గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుందని, స్వామి వారి ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


