నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత
భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి జిల్లాలో తొలి విడతలో జరగబోయే పంచాయితీ ఎన్నికలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 320 పోలింగ్ స్థానాలలోని 1510 పోలింగ్ కేంద్రాలలో పోలీస్ శాఖ తరపున పూర్తిస్థాయి బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సుమారుగా 1700 మంది పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందని అన్నారు.1510 పోలింగ్ కేంద్రాలలో సాధారణ పోలింగ్ కేంద్రాలు 723, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 157, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 24, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 16, మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాలు 590లను గుర్తించినట్లు తెలిపారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలీస్ అధికారులు సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా నగదు మద్యం వంటి వాటితో పట్టుబడితే చట్టపరంగా కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్పి తెలిపారు.


