మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం
పోలింగ్ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాలు
భద్రతా చర్యలు పకడ్బందీగా అమలు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
కాకతీయ, రామకృష్ణాపూర్ : జిల్లాలో ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్తో పాటు నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమగ్ర చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
మంచిర్యాల కార్పొరేషన్లో 60 డివిజన్లకు 265 పోలింగ్ కేంద్రాలు, బెల్లంపల్లిలో 34 వార్డులకు 68, చెన్నూరులో 18 వార్డులకు 36, క్యాతనపల్లిలో 22 వార్డులకు 45, లక్షెట్టిపేటలో 15 వార్డులకు 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బందిని కేటాయించి అవసరమైన శిక్షణ అందించినట్లు పేర్కొన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుండా ఏర్పాట్లు చేసి, తాగునీరు, నీడ వంటి సదుపాయాలు కల్పించామని చెప్పారు. పోలీస్ శాఖతో సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టామని, 100 మీటర్ల వ్యాసార్థం నిబంధన కచ్చితంగా అమలవుతుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.


