ఇంగ్లీషు భాషా పరిజ్ఞానం పెరిగేలా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అమలు..
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి
1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రీడింగ్ స్కిల్స్ పెంపుపై ప్రతిరోజు గంట సమయం కేటాయింపు
రెబ్బవరం, వైరా గుట్ట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, సిపిఎస్ కేంద్ర ప్రాథమిక పాఠశాలల్లో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం మెరుగుపర్చి, రీడింగ్ స్కిల్స్ పెంపొందేలాగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
వైరా మున్సిపాలిటీ లోని గుట్టబడి ప్రాథమిక పాఠశాల, రెబ్బవరంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను తిరుగుతూ విద్యా భోదనను గమనించారు. రెండు, మూడు, నాలుగు, ఐదవ తరగతి గదులలో విద్యార్థులతో ప్రత్యేకంగా అందించిన రైమ్స్ ఎలా వున్నాయి అని అడిగారు. బోర్డు పై ఇంగ్లీషు అక్షరాలు, పదాలు, పద్యాలు వ్రాసి వాటియొక్క ఉచ్చారణ, అర్ధం చేసుకుంటూ, తిరిగి చెప్పగలుగుతున్నారా, ధ్వనులను బట్టి ఇంగ్లీష్ పదాలను గుర్తిస్తున్నారా అని విద్యార్థుల సామర్థ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం బాగుంటుందా.. కోడిగుడ్డు ఇస్తున్నారా.. కూరలు రుచిగా ఉంటున్నాయా.. అని ఆరా తీశారు.
అనంతరం రెబ్బవరం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పదవి తరగతి గదిలో విద్యార్థులతో బోర్డు పరీక్షలకు ఏలా సంసిద్దం అవుతున్నారు అని అడిగి, ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు సులభంగా రాసేందుకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి విద్యార్థికి చదివే సామర్థ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా ఎవ్రీ చైల్డ్ రీడ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. విద్యా ప్రమాణాల పెంపుదలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. విద్యార్థులకు ముందుగా చదవడం, చదివింది అర్థం చేసుకోవడం అనే నైపుణ్యాలు రావడం చాలా కీలకమని అన్నారు.
ఒక విద్యార్థికి చదివే సామర్థ్యం అందిస్తే జీవితాంతం ఉపయోగ పడుతుందని, విద్యార్థుల చదివే సామర్థ్యం పెంపు చేయడం కోసం చేపట్టిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్దపెట్టి భోదన చేయాలన్నారు.
ప్రతి రోజు విద్యార్థి గంట సేపు చదివే సామర్థ్యంపై అభ్యాసన చేసేలా సాంకేతిక పరిజ్ఞానంతో ఒక బుక్ లెట్ తయారు చేయడం జరిగిందని అన్నారు. బుక్లెట్ లో ఉన్న అంశాలను తూ.చ. తప్పకుండా ఉపాధ్యాయులు ఫాలో అవుతూ పిల్లల చదివే సామర్థ్యం పెంపొందేలా కృషి చేయాలని అన్నారు.
ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమ పర్యవేక్షణకు ఒక యాప్ తయారు చేశామని, దీనిని యూ.డి.ఐ.ఎస్. తో అనుసంధానం చేయడం వల్ల ఎటువంటి డాటా ఎంట్రీ అవసరం ఉండదని, ప్రతి బుధవారం విద్యార్థి రీడింగ్ స్కిల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో (అక్షరాలు, పదాలు, వ్యాఖ్యలు) అప్ డేట్ మాత్రం చేయాలని అన్నారు. ఆంగ్ల అక్షరాలను ఫోనెటిక్ సౌండ్ తో సహా నేర్పేలా కోర్సు డిజైన్ చేశామని అన్నారు.

ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెడితే ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం పరిపూర్ణంగా అమలు చేయవచ్చని, నెల రోజుల తర్వాత ప్రతి విద్యార్థి కనీసం ఒక పేరాగ్రాఫ్ చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం ప్రతి రోజు పాఠశాల సమయాల్లోనే ప్రాథమిక తరగతి విద్యార్థులకు అమలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఇవో దీక్షారైనా, విద్యా శాఖ సిఎంఓ ప్రవీణ్, వైరా తహసీల్దారు శ్రీనివాసరావు, హెడ్ మాస్టర్ లు, టీచర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



