- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు
- భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
- కొత్తగూడెం డీఎస్పీ కార్యాలయం సందర్శన
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. మంగళవారం ఆయన కొత్తగూడెం డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించారు. ముందుగా కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్ ఎస్పీకి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ సబ్ డివిజన్ పరిధిలో గల అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సబ్ డివిజన్లో నేరాలు జరగకుండా ప్రతి ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం అవగాహన కల్పించాలని తెలిపారు.
సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బాధితులకు అండగా ఉంటూ పోలీస్ శాఖపై మరింత నమ్మకాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ భాద్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో కొత్తగూడెం టుటౌన్ సీఐ ప్రతాప్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సీఐ కరుణాకర్, త్రీ టౌన్ సీఐ శివప్రసాద్, సబ్ డివిజన్లోని ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


