సీఎం కప్లో ఆకునూరు విద్యార్థుల సత్తా
కాకతీయ, చేర్యాల : మండలంలోని ఆకునూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎం కప్ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. చేర్యాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జనవరి 30, 31 తేదీలలో నిర్వహించిన సీఎం కప్ పోటీల్లో విద్యార్థులు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచారు. బాలికల విభాగంలో వాలీబాల్, కబడ్డీ పోటీల్లో ప్రథమ స్థానాలు సాధించారు. బాలుర విభాగంలో కబడ్డీ, ఖోఖో పోటీల్లో కూడా మొదటి స్థానాలు దక్కించుకున్నారు. అండర్–16 విభాగంలో 100 మీటర్ల పరుగు పందెంలో సృజన ప్రథమ స్థానం, నాజియా ద్వితీయ స్థానం సాధించారు. 200 మీటర్ల పరుగు పందెంలో నాజియా ప్రథమ స్థానం, 400 మీటర్ల విభాగంలో సృజన ద్వితీయ స్థానం పొందారు. అండర్–14 విభాగంలో 100 మీటర్లలో సరీనా తృతీయ స్థానం, 200 మీటర్లలో కరీం ద్వితీయ స్థానం సాధించి మెరిశారు. విజేతలైన విద్యార్థులను బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొమ్ము రవి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. క్రీడా రంగంలో ముందుకు వెళ్లే విద్యార్థులకు గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సైదా బేగం, ఉప సర్పంచ్ పల్లవి భాస్కర్, వార్డు సభ్యురాలు సుర అనిత, పీఈటీ కవిత, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.


