ఎదులాపురం 15వ వార్డు ఏకగ్రీవం
పోటీ నుంచి తప్పుకున్న తమ్మినేని విజయలక్ష్మి
తెల్లారుపల్లిలో ఆసక్తికర రాజకీయ మలుపు
కాకతీయ, కూసుమంచి : ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తెల్లారుపల్లి 15వ వార్డు రాజకీయంగా కీలక పరిణామాలకు వేదికైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తమ్మినేని మంగతాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు ప్రత్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సీపీఎం నాయకుడు తమ్మినేని కోటేశ్వరరావు సతీమణి తమ్మినేని విజయలక్ష్మి సోమవారం తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఈ వార్డు పోటీ లేకుండా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది.
తమ్మినేని మంగతాయి దివంగత నేత తమ్మినేని కృష్ణయ్య సతీమణి కావడం, గతంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ వార్డు ఎన్నికలపై మొదటినుంచి ఉత్కంఠ నెలకొంది. 2022 ఆగస్టు 15న తెల్లారుపల్లిలో తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన కుమారుడు తమ్మినేని నవీన్ రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఎదిగారు.
ఇదే హత్య కేసులో ప్రధాన నిందితుడిగా తమ్మినేని కోటేశ్వరరావు జైలు వెళ్లి వచ్చిన నేపథ్యంలో రెండు కుటుంబాలు ప్రత్యక్ష పోటీలో నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే అనూహ్యంగా తమ్మినేని విజయలక్ష్మి పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా మారింది.
నామినేషన్ ఉపసంహరణ వెనుక జరిగిన పరిణామాలు ఏమిటన్నదానిపై స్థానికంగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెరవెనుక ఏ ఒప్పందాలు జరిగాయన్న దానిపై స్పష్టత లేకపోయినా, ఈ పరిణామం ఎదులాపురం మున్సిపల్ ఎన్నికల్లో మరో కొత్త మలుపుగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


