జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలి
బీజేపీపై భూక్య రాజేష్ నాయక్ తీవ్ర విమర్శలు
కార్యకర్తలను పట్టించుకోలేదని ఆరోపణ
ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని ఆవేదన
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ అధ్యక్షుడు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని సర్వారం సర్పంచ్ అభ్యర్థి, సుజాతనగర్ మండల మాజీ పార్టీ అధ్యక్షుడు భూక్య రాజేష్ నాయక్ డిమాండ్ చేశారు. పార్టీ కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ఎన్నికల్లో సరైన నాయకత్వం చూపించలేదని ఒక ప్రకటనలో తీవ్ర విమర్శలు చేశారు. జిల్లాలో ఇప్పటివరకు జిల్లా కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయకపోవడం, కార్యవర్గ సమావేశాలు నిర్వహించకపోవడం వల్ల కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారని తెలిపారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అన్ని పంచాయతీల్లో అభ్యర్థులను నిలబెట్టకపోవడం, నిలబెట్టిన అభ్యర్థులకు కూడా పార్టీ నుంచి సరైన సహకారం అందించకపోవడం జరిగిందని ఆరోపించారు. ప్రచార సామాగ్రి అందించడంలో కూడా పార్టీ విఫలమైందని పేర్కొన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరించారని విమర్శించారు. పార్టీకి కట్టుబడి పనిచేసిన కార్యకర్తలను పక్కనబెట్టి, పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తులకు టికెట్లు ఇచ్చారని ఆరోపించారు. ప్రచారం, ర్యాలీలు నిర్వహించకుండా అభ్యర్థులను ఒంటరిగా వదిలేశారని అన్నారు. పార్టీ ఫండింగ్ కూడా అభ్యర్థులకు పూర్తిస్థాయిలో అందకుండా చేయడం వల్ల ఎన్నికల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్నదని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ బలహీనపడడానికి జిల్లా అధ్యక్షుడి నాయకత్వ లోపమే ప్రధాన కారణమని విమర్శించారు. కనీసం అభ్యర్థులు డిపాజిట్ కూడా పొందలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ సహకారం లేకపోయినా కార్యకర్తలు కష్టపడి పోటీ చేశారని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షుడు నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడిని జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు. పార్టీ పునర్నిర్మాణం కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోయగూడెం సర్పంచ్ అభ్యర్థి జర్పుల భీక్కులాల్ పాల్గొన్నారు.


