విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
కాకతీయ, ఖమ్మం : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన గ్రీటింగ్ కార్డులపై తమ సృజనాత్మకతను ప్రదర్శించిన ఖమ్మం నగరంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర హాస్టల్ ‘బి’ విద్యార్థులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందించారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన గ్రీటింగ్ కార్డులను జిల్లా కలెక్టర్ దంపతులకు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డికి, జిల్లా అధికారులు శ్రీమతి గుడికందుల జ్యోతి, నారీ విజయలక్ష్మి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొనిదెన శ్రీనివాస్లకు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన సందేశాలు, కొటేషన్లను పొందుపరుస్తూ విద్యార్థులు ఎంతో శ్రద్ధతో తయారు చేసిన ఈ గ్రీటింగ్ కార్డులు వారి ప్రతిభ, సృజనాత్మకతతో పాటు సామాజిక బాధ్యతను ప్రతిబింబిస్తున్నాయని అధికారులు ప్రశంసించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేలా ప్రోత్సహిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు విద్యతో పాటు సృజనాత్మకతను పెంపొందించుకుంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. జిల్లాలో హాస్టల్ సంక్షేమ అధికారులు, సిబ్బంది విద్యార్థులకు అందిస్తున్న మార్గదర్శకత్వం, స్ఫూర్తిదాయక కార్యక్రమాలు హర్షణీయమని అధికారులు తెలిపారు. ఈ విధమైన కార్యక్రమాలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి గుడికందుల జ్యోతి, వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు, సూపరింటెండెంట్లు రహీముద్దీన్, వెక్కిరాల శ్రీనివాస్, సముద్రాల శ్రీనివాస్తో పాటు ఆఫీస్ సిబ్బంది అస్లాం ఖాన్, శంకర్, రాకేష్, నెల్లూరి నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, తిరుపతిరావు, నరేందర్, రమేష్, హనుమంతరావు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


