భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం సతీమణి
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానాన్ని మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా సందర్శించారు. ఆలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం సతీమణికి ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో ముఖ్య అర్చకులు చెప్పెల వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మలు మహదాశీర్వచనం నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ రామల సునీత అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదం అందజేశారు.


