సైబర్ మోసాల గుట్టు రట్టు
నకిలీ ట్రేడింగ్ యాప్లతో కోట్లు వసూళ్లు
దుబాయ్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ముఠా
ఐదుగురు కీలక ఏజెంట్లను అరెస్టు చేసిన ఖమ్మం పోలీసులు
రూ.2.73 కోట్ల అక్రమ ఆస్తులు స్వాధీనం
కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఫారెక్స్ ట్రేడింగ్, ఆన్లైన్ పెట్టుబడి యాప్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అంతర్జాతీయ స్థాయి సైబర్ ముఠాను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. నకిలీ యాప్ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ నెట్వర్క్ను ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఛేదించాయి. ప్రధాన ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి, భారీగా అక్రమ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. “బాట్ బ్రో”, “వైఎఫ్ఎక్స్”, “మినీ క్రిప్టో”, “బిట్ నోవా”, “క్యూఎఫ్ఎక్స్” వంటి పేర్లతో రూపొందించిన యాప్ల ద్వారా ఈ ముఠా ప్రజలను ఆకర్షించింది. నెలకు 9 నుంచి 10 శాతం లాభాలు వస్తాయని నమ్మబలికి పెట్టుబడులు సేకరించారు. వాస్తవానికి ఇవన్నీ ప్రభుత్వ అనుమతి లేని నకిలీ ఎమ్ఎల్ఎం స్కీమ్లని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఖమ్మం కేంద్రంగా పనిచేస్తున్న ఐదుగురు ప్రధాన ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. భుక్య శ్రీధర్ నాయక్ (28) – ఖానాపురం, ఖమ్మం, తేజావత్ ఉపేందర్ (37) – కైకండిరగూడెం, నీలకంఠం సిద్ధు (32), వంకుడ్యత్ సురేష్ (29) – కారేపల్లి మండలం, మరికొందరు మధ్యవర్తులపై చీటింగ్, ఐటీ యాక్ట్–2008 నిబంధనల కింద కేసులు నమోదు చేశారు.
దుబాయ్ నుంచే కుట్ర
ఈ మోసాలకు ప్రధాన సూత్రధారి దుబాయ్ కేంద్రంగా ఉన్న లవిష్ చౌదరి అలియాస్ నవాబ్ అలీ అని పోలీసులు గుర్తించారు. ఇతడితో పాటు ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్కు చెందిన గజేంద్ర సింగ్, దీపక్ యాదవ్, ప్రిన్స్ గుప్తా, ప్రమోద్ మౌర్య, వికాస్ మౌర్య తదితరులు కీలకంగా వ్యవహరించినట్లు వెల్లడైంది.
అరెస్టయిన ఐదుగురు ఏజెంట్లు ఇప్పటివరకు రూ.2,73,43,440 అక్రమంగా సంపాదించినట్లు విచారణలో తేలింది. ఈ డబ్బుతో వారు కుటుంబ సభ్యుల పేర్లపై స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆస్తుల అటాచ్మెంట్ ప్రక్రియ ప్రారంభమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ నెట్వర్క్లో ఇంకా పలువురు స్థానిక ఏజెంట్లు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. బాధితుల వివరాలు సేకరించి మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


