చేర్యాలలో కాంగ్రెస్ జోరు..
మొదటి దశ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టం
ఏడు వార్డుల్లో ఐదింట కాంగ్రెస్ విజయం
రెండు వార్డుల్లో బీఆర్ఎస్ ఖాతా ఓపెన్
కాకతీయ, చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీలో వెలువడిన ప్రారంభ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు ప్రకటించిన ఏడు వార్డుల ఫలితాల్లో ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా, రెండు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలమైన స్థితిలో నిలిచినట్లు స్పష్టమవుతోంది. ప్రారంభం నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు వరుస విజయాలతో దూసుకెళ్లారు. 1వ వార్డులో ఒగ్గు వెంకటమ్మ, 3వ వార్డులో కొమ్ము రాజేశ్వరీ, 5వ వార్డులో వెలుగుల దుర్గయ్య, 7వ వార్డులో పోతుగంటి ప్రసాద్, 12వ వార్డులో షరీఫా బేగం విజయం సాధించి కాంగ్రెస్ ఖాతాలో కీలక స్థానాలను చేర్చారు. ఈ విజయాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
బీఆర్ఎస్కు రెండు వార్డులు
ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా రెండు వార్డుల్లో విజయం సాధించి తన ఖాతా తెరిచింది. 9వ వార్డులో వీరబత్తిని సదానందం, 11వ వార్డులో ఎండి ఇజాజ్ అహ్మద్ విజయం సాధించారు. కీలక వార్డుల్లో బీఆర్ఎస్ పోటీ ఇచ్చినప్పటికీ, మొత్తం ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నప్పటికీ, మిగిలిన వార్డుల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే మున్సిపాలిటీపై ఏ పార్టీ ఆధిపత్యం సాధిస్తుందో స్పష్టత రానుంది. ప్రస్తుతం చేర్యాల పట్టణంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.


