ఇల్లందులో ఎగిరిన కాంగ్రెస్ జెండా
మున్సిపల్ చైర్మన్గా దొడ్డ కిరణ్ మిత్ర
వైస్ చైర్మన్గా పెండ్యాల రాజు
24 వార్డుల్లో 21 మంది మద్దతుతో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం
కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : ఇల్లందు మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం మంగళవారం అటహాసంగా కొలువుదీరింది. మున్సిపల్ చైర్మన్గా రెండో వార్డు కౌన్సిలర్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్గా 17వ వార్డు కౌన్సిలర్ పెండ్యాల రాజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇల్లందు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులు ఉండగా, కాంగ్రెస్ పార్టీ 19 వార్డుల్లో విజయం సాధించింది. అదనంగా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడంతో మొత్తం 21 మంది కౌన్సిలర్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పాలనపై స్పష్టమైన ఆధిపత్యాన్ని సాధించింది. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవ వాతావరణంలో పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఆర్డీఓ మధు హాజరై చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మున్సిపల్ కమిషనర్ గణేష్, తహసీల్దార్ రవికుమార్, ఎండీఓ దన్ సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ డి.వి. తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్మన్ దొడ్డ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ పెండ్యాల రాజు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వార్డుల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, మంచినీటి సరఫరాను సక్రమంగా అందించడం, రహదారులు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇల్లందు పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సమిష్టిగా పనిచేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చింది.


